దర్శకరత్న దాసరి నారాయణరావు తెలుగు సినిమా గర్వించదగ్గ గొప్ప దర్శకుడిగా ఎదగడంతో పాటు, రాజకీయాల్లోనూ, కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులను అధిరోహించి, ఆ తర్వాత రాజ్యసభకు ఎంపిక అయి, చివరకు కేంద్ర మంత్రి పదవిని చేపట్టే వరకు ఎదిగారు. సినిమాల్లో సక్సెస్ఫుల్ దర్శకుడిగా ఉన్న దాసరి, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? తను ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందించిన ఎన్టీఆర్ మీద ఆయన ఎందుకు కక్ష కట్టారు? అంటే, దీని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.
అదేమిటంటే, పాలకొల్లులో దాసరి నారాయణరావు ఫ్యామిలీ, ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరులుగా ఉంటూ ఉండేవారు. సినిమా రంగంలోకి వచ్చినప్పుడు ఆయనకు అప్పటి ముఖ్య మంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో సాన్నిహిత్యం ఏర్పడింది. ఇందిరా గాంధీ రెండోసారి అధికారంలోకి వచ్చే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసేందుకు ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది. అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆ బాధ్యతను దాసరి నారాయణరావుకు అప్పగించారు. ఆ తర్వాత విజయవాడకు చెందిన దివంగత కాపు నేత వంగవీటి మోహన రంగా హత్య దాసరిని తీవ్రంగా కలిచి వేసింది. మోహనరంగాను అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం వెంటాడి, చంపిందని ఆవేదన చెందిన దాసరి, ఎమోషనల్ అయ్యి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఇక ఆ సమయంలో ఆయన సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని నియోజకవర్గాల్లో పర్యటించారు. దాసరి ప్రచారాన్ని రాజీవ్ గాంధీతో పాటు, మర్రి చెన్నారెడ్డి సైతం ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అప్పటినుంచి 2004లో రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రచార కార్యక్రమాలు, ప్రచార చిత్రాలు అన్ని దాసరి పర్యవేక్షణలోనే ఎక్కువగా జరిగేవి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రాజశేఖర్ రెడ్డి సిఫార్సుతో సోనియా గాంధీ, దాసరిని రాజ్యసభకు ఎంపిక చేయడంతో పాటు, కేంద్రమంత్రిని కూడా చేసింది. దాసరి అనుకోకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి కేంద్రమంత్రి వరకు ఎదిగారు.