1970లకి పూర్వ తరంలో వచ్చిన కొంత మంది పెద్ద నటులు చివరి రోజులలో ఆర్థికంగా చాలా కష్టాలు పడిన వారు ఉన్నారు. వారిలో నాకు తెలిసిన కొందరి పేర్లు కింద వ్రాస్తున్నా. చిత్తూరు నాగయ్య: నాగయ్య సినిమాలలో ఎన్నో ఉన్నత శిఖరాలు చూసారు. రామారావు, నాగేశ్వర రావు కన్నా ముందు ఆయన తెలుగు లో మొదటి పెద్ద హీరో. తెలుగు సినిమాలలో మొదటి సారిగా లక్ష రూపాయలు పారితోషికం తీసుకున్న నటుడు ఆయన. దక్షిణ భారత దేశం లో పద్మశ్రీ అవార్డు అందుకున్న మొదటి నటుడు ఆయన. ఆయన నటించిన యోగి వేమన, త్యాగయ్య, గృహ లక్ష్మి మున్నగు సినిమాలు ఏంతో ప్రజాధారణ పొందాయి. ఆయన చివరి నాళ్లలో అనుభవించిన ఆర్థిక కష్టాలు చాలానే ఉన్నాయి. ఒకప్పుడు ఆయనికి మద్రాస్ నగరంలో ఏభై ఎకరాలు మామిడి తోట ఉండేది. అలాంటిది ఆయన సినిమా నిర్మాతగా కొన్ని సినిమాలు తీసి ఆర్థికంగా బాగా దెబ్బ తిని చివరికి డబ్బులు లేకుండా చనిపోయారు.
కాంచనమాల: తెలుగు తెరకి మొదటి గ్లామరస్ హీరోయిన్ గా మరియు స్టార్ గా పేరు తెచ్చుకున్న నటి కాంచనమాల. శ్రీ శ్రీ మహా ప్రస్థానంలో సైతం కాంచన మాల ప్రస్తావన ఉంటది. అలాంటి కాంచనమాల 1941లో జెమినీ వాసన్ అనే నిర్మాతతో అయ్యిన గొడవ వల్ల నాలుగేళ్లు సినిమాలకి దూరం కావాల్సి వచ్చింది. వాసన్ తో చేసుకున్న అగ్రిమెంట్ వల్ల ఆవిడ వాసన్ సినిమాలలోను మరియు బయట నిర్మాతలకి ఇద్దరికీ పని చేయలేక పోయారు. అదే సమయంలో ఆవిడ భర్త కూడా చనిపోడం వల్ల ఆవిడ మతి స్థిమితం కోల్పోయి తన సొంతూరు అయిన తెనాలి వెళ్లి అక్కడే చుట్టాల ఇంట్లో ఉండి జనాలు ఎవరితోనూ కలవకుండ 40 ఏళ్ళు ఉండి చివరికి కాలం చేశారు. కస్తూరి శివ రావు: ఈయన సినిమాలలో హాస్య నటుడిగా వచ్చి కొన్ని హిట్లు కొట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. నిర్మాతగా మారి పరమానందయ్య శిష్యుల కథ తీసి ఆ సినిమాలో చాలా నష్టాలు చవి చూసి ఉన్న ఆస్తులు ఇంకా buick కార్ కూడా అమ్మేసారు. ఆ తరువాత బ్రతుకు తెరువు కోసం ఆయన మళ్లీ నాటకాలు వేయడం మొదలు పెట్టి తెనాలిలో నాటకం వేస్తూ చనిపోయారు. అప్పుడు ఆయన శవాన్ని కార్ డిక్కీలో మద్రాస్ తరలించారు. అక్కడ ఆయన అంతిమ సంస్కారాలకి కూడా డబ్బులు లేక చందాలు వేసుకుని అంతిమ సంస్కారాలు చేసారు.
హాస్యనటి గిరిజ: ఈవిడ హాస్య నటుడు రేలంగితో కలిసి కామెడీ పెయిర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎంతో విలాసవంతమైన జీవితం గడిపారు. కానీ తరువాత ఆవిడ తన భర్తతో కలిసి నిర్మాతగా మారారు. ఆవిడ తీసిన సినిమాలు అన్ని పరాజయం పొంది ఆర్థికంగా దెబ్బ తిన్నారు. భర్త, కూతురు కూడా దూరం అయ్యి చివరికి పది చదరపు అడుగుల గదిలో చివరి రోజులు గడిపారు. కాంతారావు: కాంతరావు జీవితం గురించి అందరికి తెలిసిందే. జానపద సినిమాలు అంటే ఎన్టీఆర్ తరువాత మనకి గుర్తుకొచ్చేది కాంత రావు గారే. ఒకప్పుడు మద్రాస్ నగరంలో విలాసమైన ఇల్లు మరియు జీవితం అనుభవించిన ఆయన తరువాత కాలంలో నిర్మాతగా డబ్బులు పోగొట్టుకుని హైదరాబాద్ చిక్కడపల్లిలో కిరాణా కొట్టు పెట్టుకుని జీవించారు. ఆయన చనిపోయాక కూడా ఆయన కుటుంబ సభ్యలు తెలంగాణ ప్రభుత్వానికి ఒక్క ఇల్లు ఇవ్వమని విన్నవించుకోడం ఇంకో దురదృష్టకరమైన విషయం.
రాజనాల కల్లయ్య: తెలుగు తెర మీద అత్యంత పేరు గడించిన తొలి తరం విలన్. ఎన్నో రాజభోగాలతో ఎంతో విలాసంగా బ్రతికిన జీవితం. ఈయన సినిమా నిర్మాణంలో డబ్బులు పోగొట్టుకోలేదు కానీ చెడు అలవాట్లు వల్ల ఆర్థికంగా చితికి పోయారు అని విన్నా. ఆయన కొడుకులు ఒకరు చిన్న వయసులోనే చనిపోతే మరొకరు ఇంటి నుంచి వెళ్ళిపోయి మళ్లి తిరిగిరాలేదంటే ఆయన జాడ ఆ తరువాత తెలియలేదంట. చివరి రోజులలో ఆయన హైదరాబాద్ అమీర్ పేటలో ఒక్క చిన్న గదిలో శేష జీవితం గడిపారు అని అప్పట్లో చాలా పత్రికలలో వచ్చింది. పద్మనాభం గారు: ఈయన కూడా నిర్మాతగా మారి చేయి కాల్చుకున్నారు. ఆయన ఆర్థిక కష్టాలు గురించి ఆయనే చక్రం సినిమాలో ఒక్క డైలాగ్ కూడా చెప్పారు. వీరే కాకుండా సావిత్రి, సిల్క్ స్మిత, కటారు నాగభూషణం, రక్త కన్నీరు నాగ భూషణం లాంటి వారి జీవితాలు కూడా కష్టంగానే ముగిశాయి.