Mutton Dum Pulao : మనకు రెస్టారెంట్ లలో లభించే మటన్ వెరైటీలలో మటన్ ధమ్ పులావ్ కూడా ఒకటి. మటన్ తో చేసే ఈ దమ్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ మటన్ దమ్ పులావ్ ను అదే రుచితో మటన్ ముక్కలు మెత్తగా ఉడికేలా పులావ్ పొడి పొడిగా వచ్చేలా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, వంటరాని వారు, మొదటిసారి చేసే వారు ఇలా ఎవరైనా ఈ పులావ్ ను చేయవచ్చు. ఇంట్లోనే రుచిగా మటన్ దమ్ పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ దమ్ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అర గంట పాటు ననాబెట్టిన బాస్మతీ బియ్యం – 800 గ్రా., సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 3, పచ్చిమిర్చి – 5, నూనె – 4 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క, యాలకులు – 3, జాప్రతి – 1, లవంగాలు – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టేబుల్ స్పూన్, తరిగిన టమాటాలు – 3, పసుపు – పావు టీస్పూన్, కాశ్మీరి చిల్లీ కారం – ఒక టీ స్పూన్, వేడి నీళ్లు – 2 లీటర్లు, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత.
![Mutton Dum Pulao : హోటల్ స్టైల్లో మటన్ దమ్ పులావ్.. ఒక్కసారి ఇలా చేస్తే.. మళ్లీ ఇలాగే కావాలంటారు..! Mutton Dum Pulao recipe make it in hotel style](https://ayurvedam365-com.in9.cdn-alpha.com//opt/bitnami/wordpress/wp-content/uploads/2023/06/mutton-dum-pulao.jpg)
మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు..
మటన్ – కిలో, ఉప్పు – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కాశ్మీరి చిల్లీ కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి -ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, పెరుగు – 150 గ్రా..
మటన్ దమ్ పులావ్ తయారీ విధానం..
ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 30 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత అడుగు మందంగా ఉండే గిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. మసాలా దినుసులు వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా రంగు మారగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు, పచ్చిమిర్చి వేసి కలపాలి. తరుఆత పసుపు, కాశ్మీరి కారం వేసి కలపాలి.
టమాట ముక్కలు మెత్తబడిన తరువాత మ్యారినేట్ చేసుకున్న మటన్,అర గ్లాస్ నీళ్లు పోసి కలిపి పెద్ద మంటపై పది నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత వేడి నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి 40 నుండి 45 నిమిషాల పాటు పెద్ద మంటపై మటన్ 90 శాతం ఉడికే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. తరువాత ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు చొప్పున వేడి నీటిని పోయాలి. తరువాత తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు నానబెట్టుకన్న బియ్యాన్ని వడకట్టి వేసుకోవాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత అన్నం ఉడుకుపట్టే వరకు పెద్ద మంటపై ఉడికించాలి.
తరువాత మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు మరోసారి అంతా కలిసేలా కలుపుకుని గిన్నెను సిల్వర్ ఫాయిల్ పేపర్ తో మూసివేసి మూత పెట్టాలి. ఇది అందుబాటులోలేని వారు గోధుమపిండిని గిన్నె అంచుల చుట్టూ ఉంచి మూత పెట్టాలి. ఇప్పుడు మంటను చిన్నగా చేసి 12 నుండి 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని మరో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ ధమ్ పులావ్ తయారవుతుంది. దీనిని రైతా, ఉల్లిపాయలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మనం ఇంట్లోనే సులభంగా, రుచిగా మటన్ పులావ్ ను తయారు చేసుకుని తినవచ్చు.