వంటింటి పోపు దినుసులను మితంగా వాడుకోవాలి. ఘాటు అధికంగా ఉండే లవంగాలు, యాలకులు, అల్లం, వెల్లుల్లి కలిపి వాడటం తగ్గించాలి. వీటిని విడిగా వాడితే సహజ ఔషధ తత్వాలు ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న శరీర, ఆరోగ్య సమస్యలకు ఈ చిట్కాలను వాడండి. దాల్చిన చెక్క పొడిచేసి పాలతో తాగితే నిద్రలేమితో బాధపడేవారికి మంచి ఉపశమనం. యాలకులని పాలలో వేసి ఐదారు చుక్కల చొప్పున రాత్రిపూట తీసుకొంటే మంచి నిద్రపడుతుంది. పావుచెంచా పసుపును శోబిమచ్చలపై రాస్తే అవి క్రమంగా తగ్గిపోతాయి.
విరేచనాలవుతున్నప్పుడు పాలలో కాస్త పసుపు కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. మంట, దురద, దద్దర్లు వంటి సమస్యలున్న చోట జీలకర్ర ముద్దను రాస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది. కీళ్ల నొప్పులు బాధిస్తుంటే అక్కడ ఆవనూనెతో మర్ధనా చేస్తే వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది.
మెంతులని మెత్తగా నూరుకొని శిరోజాలకు పెడితే మృదువుగా మారతాయి. సున్నిపిండిలో మెంతుల్ని కలిపి వాడితే చర్మం ప్రకాశవంతాన్ని సంతరించుకుంటుంది. దాల్చిన చెక్క ముద్దని పాలలో కలిపి ముఖంపై మచ్చలకు రాస్తే అవి త్వరగా చర్మంలో కలిసిపోతాయి. లవంగాలను కాల్చి నమిలితే దగ్గు తగ్గుతుంది.