మనలో చాలా మందికి అప్పుడప్పుడు అసిడిటీ సమస్య వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. కారం, మసాలాలు, పులుపు ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవడం, అతిగా భోజనం చేయడం, మద్యం సేవించడం, పొగ తాగడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల అసిడిటీ సమస్య వస్తుంటుంది. ఇక వేళకు భోజనం చేయకపోయినా కొందరికి ఈ సమస్య వస్తుంది. అయితే ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్తో పనిలేదు. ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే అసిడిటీ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి అందుకు ఏం చేయాలంటే…
1. జీర్ణ సమస్యలను తగ్గించడంలో వాము అద్భుతంగా పనిచేస్తుంది. కొద్దిగా వాము తీసుకుని అందులో చిటికెడు ఉప్పు వేసి బాగా నలిపి తినాలి. అనంతరం ఒక గ్లాస్ నీటిని తాగాలి. దీని వల్ల అసిడిటీ సమస్య తగ్గుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
2. భోజనం చేసిన అనంతరం సోంపు గింజలను తింటున్నా లేదా సోంపు గింజలతో డికాషన్ తయారు చేసుకుని తాగినా అసిడిటీ సమస్య నుంచి బయట పడవచ్చు. జీర్ణ సమస్యలను తగ్గించడంలో సోంపు కూడా బాగా పనిచేస్తుంది.
3. అసిడిటీ సమస్య ఉన్నవారు భోజనం చివర్లో కచ్చితంగా పెరుగును తీసుకోవాలి. లేదా పలుచని మజ్జిగ కూడా తాగవచ్చు. మజ్జిగలో కొద్దిగా చక్కెర కలిపి తాగితే ఇంకా మంచిది. ఇది అసిడిటీ సమస్యను తగ్గిస్తుంది.
4. భోజనం చేసిన అనంతరం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనెను కలిపి తాగితే అసిడిటీ సమస్య తగ్గుతుంది.
5. మజ్జిగలో లేదా ఒక గ్లాస్ నీటిలో 10 ఎంఎల్ కొత్తిమీర రసం లేదా ఒక టీస్పూన్ ధనియాల పొడిని కలిపి తాగితే జీర్ణ సమస్యలు ఉండవు. అసిడిటీ తగ్గుతుంది.
6. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. గ్యాస్, కడుపులో మంట తగ్గుతాయి.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365