భారతీయులకు, కుక్కలకు ఇక్కడ ప్రవేశం లేదు అని.. చిట్టగాంగ్ పట్టణంలోని ఒక బ్రిటిష్ క్లబ్ ముందు బోర్డ్ కట్టారు. ఎంత దుర్మార్గం.. ఎంత అహంకారం. బ్రిటిష్ వాళ్ళ ఈ దుర్మార్గాన్ని చూసి.. ఓ అమ్మాయి మనసు రగిలింది. ఆమె గుండెలో ఆగ్రహం మండింది. ఆమె కళ్ళలో అగ్ని జ్వాలలు రేగాయి. ఎలాగైనా ఆ బోర్డుని బద్దలుకొట్టి.. తెల్లవాళ్లకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకొంది. ఆమె పేరు ప్రీతిలత. కలకత్తా యూనివర్సిటీలో బి.ఏ. ఫస్ట్ క్లాసులో పాస్ అయిన మేధావి.
స్వరాజ్యవీరుడు సూర్యసేన్ సహకారంతో..1932సెప్టెంబర్ 24 రాత్రి 10:45నిముషాలకు.. బ్రిటిష్ క్లబ్ పైన దాడి చేసింది. ఒక్క దెబ్బకే బోర్డ్ బద్దలయ్యింది. క్లబ్ లోకి ధైర్యంగా అడుగుపెట్టి .. కాల్చడం మొదలు పెట్టారు ప్రీతిలత బృందం. యువ వీరుల్ని చూసి భయంతో గజగజ లాడారు బ్రిటిష్ అధికారులు. అప్పటికే చాలా మంది గాయపడ్డారు. ఇంతలో.. ఒక మూలనుండి ప్రీతిలతని గురి చూసి కాల్చాడు ఓ తెల్లవాడు. బులెట్.. ప్రీతిలత భుజంలోకి దూసుకు పోయింది. రక్తం ధార కట్టింది. ఆ చేతిని అలాగే నొక్కి పెట్టి.. ప్రీతిలత ముందుకు సాగింది. ఆమె ధైర్యానికి బ్రిటీష్ అధికారులు వణికిపోయారు.
క్రమంగా బులెట్ గాయంనుండి రక్తస్రావం ఎక్కువయ్యింది. ప్రాణాలతో ఆంగ్లేయులకు దొరకడం ప్రీతిలతకు ఇష్టం లేదు. అందుకే.. తనతో తెచ్చుకొన్న విషం మింగి.. భరతమాతకూ జై అంటూ.. ప్రాణాలు విడిచింది. ప్రీతిలతకు అప్పటికి కేవలం ఇరవై ఒక్కేళ్ల వయసు మాత్రమే. ఆ తర్వాత భారతీయుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే అటువంటి బోర్డులు మరెక్కడా పెట్టే ధైర్యం చేయలేకపోయారు తెల్లవాళ్ళు.