నేనేం చేయను. ట్రాఫిక్ లో చిక్కుకొని సమయానికి రాలేక పోయాను అని చెబితే రోగి, బంధువులు నమ్మేవారే. కానీ ఆ వైద్యుడు అలా అనలేదు. అందుకు ఆస్కారం ఇవ్వలేదు. పరిస్థితులకు తలొగ్గలేదు. అందుకే ఆయన దేవుడు, వైద్యుడు అయ్యారు.
బెంగళూరు కు చెందిన డాక్టర్ గోవింద్ నంద కుమార్ గాస్ట్రో ఎంట్రాలజిస్ట్. ఓ శస్త్ర చికిత్స చేయాల్సి వుంది. కారులో బయలుదేరారు. దారిలో భారీ వర్షం మొదలైంది. రోడ్లన్నీ మునిగాయి. ఎక్కడి వాహనాలు అక్కడే బంద్. గూగుల్ లో వెతికారు. 45 నిముషాలకు ట్రాఫిక్ నుంచి బయట పడి, ఆసుపత్రికి చేరే అవకాశం ఉంది అని తేల్చింది. అలా అయితే సమయానికి చేరలేనని అనుకున్నారు. వెంటనే కారు డ్రైవర్ కి అప్పగించి, డాక్టర్ రోడ్డుపై పరుగులు మొదలు పెట్టారు.
సమయానికి చేరుకుని ఆపరేషన్ పూర్తి చేశారు. ఆయన తపనకు అందరూ ఆశ్చర్యపోయారు.
ఈ విషయాన్ని డాక్టర్ ఆలస్యంగా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని పత్రికలు కూడా ప్రముఖంగా ప్రచురించాయి.