ఎవరైనా టూర్ వెళ్లినప్పుడు అక్కడ వారు కోరుకునే వాటిలో ముఖ్యమైనవి ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి. అవి లేకపోతే టూర్ వెళ్లినా వృథా. మరి అలాంటి స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం దొరికే ప్రాంతాలు మన దేశంలో ఎక్కడ ఉన్నాయో తెలుసా..? ఇంకెందుకాలస్యం..! వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం రండి..! ఇప్పుడు మేం చెప్పబోయే ప్రాంతాలన్నీ ఎంత శుభ్రంగా ఉంటాయంటే, ఒక్కసారి గనక మీరు అక్కడికి వెళితే ఇక ఎప్పటికీ అక్కడే ఉండాలనిపిస్తుంది. అంత మనోహరంగా ఉంటాయి ఆ ప్రాంతాలు. అవేమిటంటే.. గాంగ్టక్… కొండ చరియలతో చూడ ముచ్చటగా ఉండే ఈ ప్రాంతం లో చెత్త చూద్దామంటే కనబడదు. దీనికి తోడు ఎక్కడ పడితే అక్కడ మొక్కలు, భారీ వృక్షాలు ఉంటాయి. కనుక స్వచ్ఛమైన గాలితోపాటు, ప్రశాంతమైన వాతావరణం కూడా దొరుకుతుంది. గాంగ్టక్ లో ఎంజీ మార్గ్లో ఉన్న షాపింగ్ ఏరియా చూడదగ్గ ప్రదేశం. సిక్కిం వెళ్తే గాంగ్టక్ అందాలను వీక్షించవచ్చు.
మేఘాలయ రాజధాని షిల్లాంగ్. ఇక్కడి పర్వతాలు, జలపాతాలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఎలిఫెంట్ ఫాల్స్ అని పిలవబడే జలపాతం ఇక్కడి టూరిస్ట్ స్పాట్లలో ప్రధానమైంది. షిల్లాంగ్లో ఎక్కడ చూసినా పరిసరాలు పరిశుభ్రంగా ఉండడమే కాదు, పచ్చని ప్రకృతి కళ్లకు సాక్షాత్కరిస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఖజ్జియార్ ప్రాంతం. ఇక్కడి పచ్చిక బయళ్లు మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. పిక్నిక్ లా వెళ్లాలనుకుంటే ఇది మంచి స్పాట్. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్. ఇక్కడి బీచ్లు అందంగా, ఆహ్లాదభరితంగా ఉంటాయి. పర్వతాలు, చిన్నపాటి దీవులు ఇక్కడి చూడదగిన ప్రదేశాలు. పాండిచ్చేరి… ఇక్కడి బీచ్లు దేశంలో ఉన్న బీచ్లలోకెల్లా అత్యంత పరిశుభ్రమైన బీచ్లుగా పేరుగాంచాయి. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం వీక్షించాలంటే రెండు కళ్లు సరిపోవు.
మైసూర్… విశాలవంతమైన, పరిశుభ్రమైన రహదారులు, స్వచ్ఛమైన గాలినిచ్చే చెట్లు, ఎన్నో చరిత్మాత్మక ప్రదేశాలు, ఆలయాలు, చర్చిలు మైసూర్లో ఉన్నాయి. ఊటీ… ఎటు చూసినా పచ్చని పచ్చదనం, కొండ చరియలు, పరిశుభ్రమైన వాతావరణం, పచ్చని ప్రకృతి అందాలు… ఇవన్నీ ఊటీలో ఉంటాయి. ప్రధానంగా వేసవి కాలంలో వెళితే చక్కని ఆహ్లాదం లభిస్తుంది.