Aloo Bread Samosa : వేడి వేడిగా ఆలు బ్రెడ్ స‌మోసాను ఇలా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Aloo Bread Samosa : మ‌నం బ్రెడ్ తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను, తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే త‌రుచూ ఒకేర‌కం స్నాక్స్ కాకుండా బ్రెడ్ తో మనం స‌మోసాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ్రెడ్ తో చేసే ఈ స‌మోసాలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. చిన్న‌గా ఉండే ఈ స‌మోసాల‌ను పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. స్నాక్స్ గా తిన‌డానికి ఎంతో చ‌క్క‌గా ఉండే ఈ బ్రెడ్ స‌మోసాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్ స‌మోసా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

సాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ – 4, మైదాపిండి – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Aloo Bread Samosa recipe in telugu make in this way
Aloo Bread Samosa

క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, బ‌ఠాణీ – 2 టేబుల్ స్పూన్స్, ఉడికించిన బంగాళాదుంప – 1, ఉప్పు – త‌గినంత‌, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, కొత్తిమీర – కొద్దిగా.

బ్రెడ్ స‌మోసా త‌యారీ విధానం..

ముందుగా కర్రీని త‌యారు చేసుకోవ‌డానికి క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వర‌కు వేయించిన త‌రువాత ప‌సుపు, గ‌రం మ‌సాలా, కారం, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి, బ‌ఠాణీలు వేసి క‌ల‌పాలి. వీటిని నిమిషం పాటు వేయించిన త‌రువాత బంగాళాదుంప‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి. త‌రువాత ఉప్పు వేసి నీరంతా పోయే వ‌ర‌కు వేయించాలి. చివ‌గ‌రా కొత్తిమీర, నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ కు ఉండే అంచుల‌ను తీసేసి వాటిని చ‌పాతీ క‌ర్ర‌తో నెమ్మ‌దిగా ప‌లుచ‌గా వ‌త్తుకోవాలి. త‌రువాత ఈ బ్రెడ్ ను త్రిభుజాకారంలో క‌ట్ చేసుకోవాలి.

ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత గిన్నెలో మైదాపిండిని వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన బ్రెడ్ పీస్ ను తీసుకుని అంచుల‌కు మైదాపిండిని రాసి నెమ్మ‌దిగా స‌మోసా ఆకారంలో చుట్టుకోవాలి. దీని లోపల ఒక టీ స్పూన్ క‌ర్రీని ఉంచి అంచుల‌కు మైదాపిండి రాసి ఊడిపోకుండా వ‌త్తుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక స‌మోసాల‌ను వేసి మ‌ధ్య‌స్థ మంట‌పై గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ స‌మోసాలు త‌యార‌వుతాయి. ఇలా త‌యారు చేసిన బ్రెడ్ స‌మోసాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts