Fish Curry : ఏమాత్రం వాస‌న రాకుండా చేప‌ల పులుసును ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Fish Curry : చేప‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. చేప‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అందులో చేప‌ల పులుసు కూడా ఒక‌టి. చేప‌ల పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే చేప‌ల పులుసు ఇష్ట‌మే అయిన‌ప్ప‌టికి చేప‌లు నీచు వాస‌న వ‌స్తాయ‌ని చాలా మంది వీటిని తిన‌డానికి ఇష్ట‌ప‌డరు. చేప‌లు నీచు వాస‌న రాకుండా వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలి.. అలాగే మ‌రింత రుచిగా చేప‌ల పులుసు ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చేప‌ల పులుసు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చేప ముక్క‌లు – కిలో, ఉప్పు – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఎండుమిర్చి -1, ధ‌నియాలు – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, మిరియాలు – 7, ల‌వంగాలు – 4, మెంతులు – పావు టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క‌, ఉల్లిపాయ – పెద్ద‌ది ఒక‌టి, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, అల్లం – ఒక ఇంచు ముక్క‌, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, నూనె – ముప్పావు క‌ప్పు, ఆవాలు – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 4, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 10, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, నాన‌బెట్టిన చింత‌పండు – పెద్ద నిమ్మ‌కాయంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Fish Curry without smell how to cook recipe in telugu
Fish Curry

చేప‌ల పులుసు త‌యారీ విధానం..

ముందుగా చేప ముక్క‌ల‌కు లోప‌ల ఉండే ఎర్ర‌టి చ‌ర్మాన్ని, న‌ల్ల‌టి చ‌ర్మాన్ని తీసి వేయాలి. త‌రువాత చేప ముక్క‌ల‌ను గురుకుగా ఉండే ప్ర‌దేశంపై వేసి బాగా రుద్దాలి. త‌రువాత రెండు సార్లు బాగా క‌డ‌గాలి. త‌రువాత రాళ్ల ఉప్పు, అర చెక్క నిమ్మ‌ర‌సం వేసి రుద్దుతూ క‌డ‌గాలి. వీటిని మ‌రో రెండు సార్లు క‌డిగి నీళ్ల‌న్ని పోయిన త‌రువాత గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, కారం, ప‌సుపు వేసి క‌లిపి అర గంట పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత త‌రువాత క‌ళాయిలో ఎండుమిర్చి, ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, మిరియాలు, ల‌వంగాలు, మెంతులు, దాల్చిన చెక్క వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.

తరువాత అదే జార్ లో పెద్ద ఉల్లిపాయ ముక్క‌లు, అల్లం, వెల్లుల్లి, కొబ్బ‌రి ముక్క‌లు వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత త‌గినంత ఉప్పు, అర టీ స్పూన్ ప‌సుపు,3 టీ స్పూన్ల కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత చేప ముక్క‌లు వేసుకోవాలి. వీటిని ఒక నిమిషం పాటు అలాగే ఉంచిన త‌రువాత మ‌రో వైపుకు నెమ్మ‌దిగా తిప్పుకోవాలి. వీటిని మ‌రో నిమిషం పాటు ఉడికించిన త‌రువాత చింత‌పండు ర‌సం, ఒక క‌ప్పు నీళ్లు పోసుకోవాలి.

వీటిని నెమ్మదిగా క‌దుపుకున్న త‌రువాత పెద్ద మంటపై 2 నిమిషాల పాటు ఉడికించాలి. పులుసు ఉడుకు పట్టిన త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పొడి, మ‌రో 5 ప‌చ్చిమిర్చి, ఒక రెమ్మ క‌రివేపాకు వేసి నెమ్మ‌దిగా క‌ల‌పాలి. తరువాత దీనిని మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చేప‌ల పులుసు త‌యార‌వుతుంది. ఈ పులుసు నీచు వాస‌న లేకుండా చాలా రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts