దోశ పిండి మిగిలిందా.. క‌ర‌క‌ర‌లాడే పునుగుల‌ను ఇలా వేయ‌వ‌చ్చు..

మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా త‌ర‌చూ దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌నం ఒకేసారి రెండు మూడు రోజుల‌కు స‌రిప‌డా దోశ పిండిని త‌యారు చేసుకుని నిల్వ చేసుకుంటూ ఉంటాం. ఈ దోశ పిండితో త‌ర‌చూ దోశ‌ల‌నే కాకుండా మ‌నం ఎంతో రుచిగా ఉండే పునుగుల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దోశ పిండి ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు లేదా దోశ పిండి మిగిలిన‌ప్పుడు దానితో మనం రుచిగా పునుగుల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. మిగిలిన దోశ పిండితో పునుగుల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వాటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

దోశ పిండి పునుగుల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దోశ పిండి – ఒక క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – పావు క‌ప్పు, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చి మిర్చి – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన క‌రివేపాకు – కొద్దిగా, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – త‌గినంత‌, నూనె – డీప్ ఫ్రై కి స‌రిప‌డా, వంట‌సోడా – పావు టీ స్పూన్, మైదా పిండి – ఒక టేబుల్ స్పూన్, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్.

make punugulu with left over dosa pindi

దోశ పిండి పునుగుల త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో దోశ పిండిని తీసుకోవాలి. ఇందులో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత ఈ పిండిని 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి నూనె కాగిన త‌రువాత పిండిని తీసుకుని పునుగుల్లా వేసుకోవాలి. ఈ పునుగుల‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై అటూ ఇటూ క‌దుపుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దోశ పిండి పునుగులు త‌యార‌వుతాయి. ఈ పునుగుల‌ను వేసేట‌ప్పుడు పులిసిన దోశ పిండిని తీసుకుంటే పునుగులు రుచిగా ఉంటాయి. అలాగే దోశ పిండి ప‌లుచ‌గా లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల క‌ర‌క‌ర‌లాడుతూ రుచిగా ఉండే పునుగులు త‌యార‌వుతాయి. వీటిని ప‌ల్లి చ‌ట్నీ, ట‌మాట చ‌ట్నీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.

Share
D

Recent Posts