Ragi Chimili : బామ్మ‌ల కాలం నాటి రాగి చిమిలి.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. అందరూ తినాలి..!

Ragi Chimili : రాగి పిండితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. రాగుల వ‌ల్ల మ‌న‌కు క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. రాగుల‌ను పిండిగా చేసి మ‌నం జావ‌, సంగ‌టి, రొట్టె ఇలా ర‌క‌ర‌కాల ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రాగుల‌తో చేసుకోద‌గిన ఇత‌ర వంట‌కాల్లో రాగి చిమిలి కూడా ఒక‌టి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. పూర్వ‌కాలంలో దీనిని ఎక్కువ‌గా త‌యారు చేసేవారు. పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు ఎవ‌రైనా దీనిని తిన‌వ‌చ్చు. ర‌క్త‌హీన‌త‌ను దూరం చేసే రాగి చిమిలిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి చిమిలి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

రాగిపిండి – రెండు క‌ప్పులు, ఉప్పు – త‌గినంత‌, ప‌ల్లీలు – ఒక క‌ప్పు, యాల‌కులు – 3, తాటి బెల్లం – తీపికి త‌గినంత‌.

Ragi Chimili recipe in telugu make in this method very healthy
Ragi Chimili

రాగి చిమిలి త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో రాగి పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, త‌గిన‌న్ని నీళ్లు పోసి పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి. త‌రువాత కొద్దిగా పిండిని తీసుకుని నెయ్యి రాసిన అర‌టి ఆకు మీద ఉంచి ప‌లుచ‌ని రొట్టెలా వ‌త్తుకోవాలి. త‌రువాత స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక రొట్టెను పెనం మీద వేసి కాల్చుకోవాలి. దీనిపై నెయ్యిలేదా నూనె వేస్తూ రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ రొట్టె కాల‌డానికి 8 నుండి 10 నిమిషాల స‌మ‌యం పడుతుంది. రాగి రొట్టెను కాల్చుకున్న త‌రువాత వీటిని ఆవిరి ప‌ట్టకుండా జ‌ల్లి గిన్నెలో వేసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో ప‌ల్లీలు వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత వీటిపై ఉండే పొట్టును తీసేసి జార్ లో వేసుకోవాలి. ఇందులోనే యాల‌కులు కూడా వేసి బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత రాగి రొట్టెల‌ను ముక్క‌లుగా చేసుకుని జార్ లో వేసుకోవాలి.

వీటిని మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. త‌రువాత కొద్దిగా పిండిని అడుగున ఉంచి మిగిలిన పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే జార్ లో త‌గినంత తాటి బెల్లం వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ ప‌ట్టుకున్న రాగి రొట్టెలు, బెల్లం, ప‌ల్లీల పొడినంత‌టిని గిన్నెలో వేసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. వీటిని ల‌డ్డూలుగా చుట్టుకోవ‌చ్చు లేదా నేరుగా గిన్నెలో వేసుకుని అయినా తిన‌వ‌చ్చు. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి చిమిలి త‌యార‌వుతుంది. అయితే డ‌యాబెటిస్ ఉన్న వారు ఇందులో బెల్లం వేయ‌కుండా కారం పొడితో క‌లిపి తీసుకోవ‌చ్చు. ఇది బ‌య‌ట ఉంచ‌డం వ‌ల్ల రెండు రోజుల పాటు తాజాగా ఉంటుంది. అదే ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకుంటే వారం రోజుల పాటు తాజాగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల రక్త‌హీన‌త స‌మ‌స్య తగ్గ‌డంతో పాటు శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది.

Share
D

Recent Posts