Veg Biryani : వెజ్ బిర్యానీ త‌యారీ ఇలా.. అద్భుతంగా రుచి ఉంటుంది..!

Veg Biryani : మ‌న‌లో చాలా మంది బిర్యానీని ఇష్టంగా తింటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఇష్టంగా తినే ఈ బిర్యానీలో చాలా ర‌కాలు ఉంటాయి. వాటిల్లో వెజ్ బిర్యానీ కూడా ఒక‌టి. వెజ్ బిర్యానీ ఎంత రుచిగా ఉంటుందో మ‌న‌కు ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఈ వెజ్ బిర్యానీని హోట‌ల్స్ లో దొరికే విధంగా చాలా సుల‌భంగా రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వెజ్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యం – ఒక గ్లాస్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 4 లేదా 5, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1 (మ‌ధ్య‌స్థంగా ఉన్న‌ది), అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన క్యారెట్ ముక్క‌లు – పావు క‌ప్పు, త‌రిగిన బంగాళాదుంప – 1, త‌రిగిన బీన్స్ – పావు క‌ప్పు, ప‌చ్చి బ‌ఠాణీ – పావు క‌ప్పు,పెద్ద‌గా త‌రిగిన క్యాప్సికం – పావు క‌ప్పు, త‌రిగిన ట‌మాటా – 1, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక‌టిన్న‌ర గ్లాస్, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Veg Biryani make in this method for perfect taste
Veg Biryani

మ‌సాలా దినుసులు..

బిర్యానీ ఆకు – 1, ల‌వంగాలు – 3, యాలకులు – 2, దాల్చిన చెక్క ముక్క‌లు – 2, మ‌రాఠీ మొగ్గ‌లు – 2, సాజీరా – ఒక టీ స్పూన్, అనాస పువ్వు – 1.

వెజ్ బిర్యానీ తయారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన త‌రువాత మ‌సాలా దినుసుల‌ను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత ప‌చ్చి మిర్చిని వేసి వేయించుకోవాలి. ప‌చ్చి మిర్చి కొద్దిగా వేగిన త‌రువాత క‌రివేపాకును, ఉల్లిపాయ‌ల‌ను వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ‌లు రంగు మారిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌లిపి ప‌చ్చి వాస‌న‌పోయే వ‌ర‌కు వేయించుకోవాలి. త‌రువాత క్యారెట్ ముక్క‌లను, బంగాళాదుంప ముక్క‌ల‌ను వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత బీన్స్, ప‌చ్చి బ‌ఠాణీ, క్యాప్సికం ముక్క‌ల‌ను వేసి క‌లిపి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.

త‌రువాత ట‌మాట ముక్క‌ల‌ను వేసి క‌లిపి మూత పెట్టి ట‌మాటాలు పూర్తిగా మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత ఒక గిన్నెలో నీళ్ల‌ను పోసి మ‌రిగించాలి. ట‌మాటా ముక్క‌లు పూర్తిగా ఉడికిన త‌రువాత ధ‌నియాల పొడిని వేసి క‌ల‌పాలి. త‌రువాత నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యాన్ని వేసి క‌లిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత మ‌రిగించిన నీళ్ల‌ను, త‌గినంత ఉప్పును వేసి క‌లిపి 5 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి. త‌రువాత ఒక‌సారి అంతా క‌లిపి కొత్తిమీర చ‌ల్లి మూత పెట్టి చిన్న మంట‌పై 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల హోట‌ల్స్ లో దొరికే విధంగా ఉండే వెజ్ బిర్యానీ త‌యార‌వుతుంది. దీనిని నేరుగా లేదా ఏదైనా మ‌సాలా కూర‌తో క‌లిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts