ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా పరీక్షల సీజన్ వచ్చేసింది. అయితే కరోనా వల్ల చాలా వరకు పరీక్షలను ఆలస్యంగానే నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఉన్న సమయంలో ప్రిపేర్ కావాలంటే విద్యార్థులకు తలకు మించిన భారంగా మారింది. పరీక్షలను ఆలస్యంగా నిర్వహిస్తున్నప్పటికీ పాఠ్యాశాలను ఇంకా పూర్తి చేయలేదు. దీంతో వారిపై ఒత్తిడి సహజంగానే ఉంటుంది. అయితే వారు చదువుల్లో మళ్లీ బాగా రాణించాలన్నా.. ఉత్తేజంగా ఉండాలన్నా.. ఏకాగ్రత పెరగాలన్నా.. వారికి అన్ని పోషకాలు ఉండే ఆహారాలను నిత్యం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో వారు చదువుల్లో రాణిస్తారు. ఈ క్రమంలోనే చిన్నారులకు తల్లిదండ్రులు నిత్యం ఇవ్వాల్సిన పౌష్టికాహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* క్లిష్టమైన పిండి పదార్థాలు కలిగిన ఆహారాలు.. అంటే ఓట్మీల్, రాగి వంటి పదార్థాలను చిన్నారులకు ఇవ్వాలి. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా వారు చదువు మీద శ్రద్ధ పెడతారు. ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే వాటితో పోషకాలు కూడా లభిస్తాయి.
* బాదంపప్పు, అవిసె గింజలు, వాల్ నట్స్ వంటి పదార్థాలను ఇవ్వడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. చదివింది బాగా గుర్తుంచుకోగలుగుతారు. అలాగే పోషకాలు కూడా లభిస్తాయి. వీటిని నేరుగా తీసుకోవచ్చు. లేదా సలాడ్స్, స్మూతీస్ వంటి వాటిలో కలిపి ఇవ్వవచ్చు.
* పిల్లలు చిరు తిండి తినడం సహజమే. చిప్స్, నూనె పదార్థాలు, స్వీట్లను వారు ఇష్టంగా తింటారు. అయితే ఇవి మెదడును స్తబ్ధుగా మారుస్తాయి. అంటే యాక్టివ్గా ఉండలేరు. నిద్రమబ్బు వచ్చినట్లు అవుతారు. వీటికి బదులుగా నట్స్, తాజా పండ్లు, పెరుగు, ఇతర తక్కువ క్యాలరీలు ఉండే ఆహారాలను ఇవ్వాలి. వీటితో శక్తి, పోషకాలు రెండూ లభిస్తాయి. మెదడు యాక్టివ్గా ఉంటుంది. చదువుల్లో రాణిస్తారు.
* నిద్ర రాకుండా ఉండేందుకు పిల్లలకు కెఫీన్ ఉండే కాఫీ, గ్రీన్ టీ, టీ వంటి పానీయాలను ఇస్తారు. అలా చేయకూడదు. కెఫీన్ వారిపై దుష్ప్రభావాలను చూపిస్తుంది. అందుకు బదులుగా ఒక కాపర్ బాటిల్లో నీటిని నింపి ఇవ్వాలి. ఆ నీటిని ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా తాగుతుండాలి. దీంతో శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. అలసిపోకుండా ఉంటారు.
* ఎగ్జామ్ టైమ్లో చిన్నారులు వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడితే వారి చదువులపై అవి తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కనుక అలా జరగకుండా ఉండాలంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. వారి రోగ నిరోధక శక్తిని పెంచే ప్రయత్నం చేయాలి. నిత్యం విటమిన్ సి ఉండే నారింజ, కివీలు, బొప్పాయి, స్ట్రాబెర్రీలు వంటి పండ్లను, ఇతర రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను ఇవ్వాలి. దీంతో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఆటంకం కలిగించకుండా ఉంటాయి.
* ప్రోటీన్లు, ఫైబర్ ఉండే ఆహారాలను కూడా నిత్యం పిల్లలకు అందించాలి. దీంతో వారు ఆరోగ్యంగా ఉంటారు. మెదడు యాక్టివ్గా ఉంటుంది. శరీర నిర్మాణం, పెరుగుదల సరిగ్గా ఉంటాయి.