ఒక వస్తువు కింద పడినప్పుడు పగిలిపోవడానికి, జీవులకు దెబ్బ తగలడానికి కారణం ఒకటే, పడడానికి ముందు, పడిన తర్వాత వాటి ద్రవ్యవేగం లో మార్పే. ద్రవ్యవేగం అంటే ఆ వస్తువులో ద్రవ్యరాశి, దాని వేగాలను గుణిస్తే వచ్చేదే. ఎత్తు నుంచి కిందకి పడే వస్తువు ద్రవ్యవేగం అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది. ఆ వస్తువు భూమిని తాకగానే అంతటి వేగమూ శూన్యం కావడం వల్ల, అంతే ద్రవ్యవేగంతో సమానమైన శక్తి ఏర్పడి ఆ వస్తువుపై వ్యతిరేక దిశలో పనిచేస్తుంది.
ఉదాహరణకు ఒక వస్తువు 20 మీటర్ల ఎత్తు నుంచి పడిపోతూ 2 సెకన్లలో నేలను తాకిందనుకుందాం. ఈ ప్రయాణంలో అది సుమారు గంటకు 72 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆ వేగాన్ని, దాని ద్రవ్యరాశితో గుణిస్తే దానిలో ఏర్పడే ద్రవ్యవేగం తెలుస్తుంది. చీమల ద్రవ్యరాశి చాలా తక్కువ కావడం వల్ల తక్కువ ద్రవ్యవేగంలోనే అవి కింద పడతాయి. అంటే కింద పడిన చీమపై కలిగే శక్తి ప్రభావం కూడా తక్కువే. మనుషుల్లాంటి బరువైన జీవులు కింద పడితే ద్రవ్యవేగం ప్రభావం ఎక్కువై గాయాలు ఏర్పడుతాయి.
కేవలం ఆధునిక మానవుడు మాత్రమే పళ్లు తోముకుంటున్నాడు. నాగరికత నేర్చిన మానవుడు పళ్లు తోముకోడానికి కేవలం సూక్ష్మక్రిముల నిర్మూలనే కారణం కాదు. ఇది సౌందర్యపరమైన అంశం కూడా. సంఘజీవులైన మనుషులు చనువుగా, దగ్గరగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దుర్వాసన ఒక సమస్యగా మారుతుంది. పళ్ల మధ్యలో చిక్కుకున్న ఆహారపు అణువులపై సూక్ష్మక్రిములు ఏర్పడ్డం వల్ల దుర్వాసనే కాదు, దంతాలు కూడా పాడవుతాయి. ఇక మనుషులు తినేంత వైవిధ్యభరితమైన ఆహారపు అలవాట్లు జంతువులకు లేవు. శాకాహార జంతువులు పీచు బాగా ఉండే ఆకులు, గడ్డి మేస్తాయి.
మొక్కల రసాలు వాటి దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. దంతాల మధ్య, చిగుళ్ళ మీద సూక్ష్మజీవులు చేరకుండా వాటిని సంహరించగలిగిన రసాయనాలు జంతువులు తినే గడ్డి , ఇతర వృక్షపదార్ధాల ద్వారా సమకూరుతాయి. శాఖాహార జంతువుల పళ్లు దగ్గరగా, పెద్దగా ఉంటాయి. మాంసాహార జంతువుల పళ్ల మధ్య ఎడం బాగా ఉంటుంది. జంతువుల నాలుకలు పొడవుగా, గరుకుగా ఉంటాయి. వాటితో అవి పళ్లను పదే పదే నాకుతూ శుభ్రం చేసుకోగలుగుతాయి. అలాగే వాటి లాలాజలంలోని లవణీయత, జిహ్వస్రావాల లాంటివి కూడా దంతక్షయం కాకుండా కాపాడుతాయి.