పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, భారతీయులు నూనెలు, అధిక కొవ్వులు, ఉప్పు మొదలైన పదార్ధాలు రోగాలను కలిగిస్తున్నాయని తెలిసినప్పటికి వాటిని ప్రతి నిత్యం తమ ఆహారంలో చేరుస్తూనే వున్నారని గుండెజబ్బులు, అధిక రక్తపోటు, డయాబెటీస్ మొదలైన వ్యాధులకు గురవుతున్నారని తాజాగా ఒక నివేదిక ప్రచురించింది. అయితే, వీటికి విరుగుడుగా అధిక పీచు పదార్ధాలున్న పండ్లు, కూరగాయలవంటివి తినటం కూడా మన దేశంలో తక్కువగానే వుందట.
పండ్లు వంటివి ప్రమాణం మేరకు ప్రతిరోజూ కనీసం 400 గ్రాములు లేదా అయిదు సార్లు తినాలని కాని భారతీయులు చాలా తక్కువగా తింటున్నారని ఈ సంస్ధ నివేదిక వెల్లడించింది. 1992 నుండి 2005 నాటికి నూనెలు 50 శాతం, కొవ్వు 41 నుండి 52 గ్రాముల వరకు పెరిగిందట. అధిక ఆదాయ వర్గాలు కొవ్వు 32 శాతం తీసుకుంటే, అల్ప ఆదాయ వర్గాలు 17 శాతం మాత్రమే తీసుకుంటున్నాయని నివేదిక తెలిపింది. ప్రొటీన్ల వినియోగం రోజుకు 56 గ్రాముల వద్ద నిలకడగా వుందట. కార్బోహైడ్రేట్ల వినియోగం రోజుకు 75 గ్రాముల నుండి 71 గ్రాములకు తగ్గింది.
రక్తపోటుకు కారణమైన ఉప్పు రోజుకు 9 నుండి 12 గ్రాములుగా అత్యధికంగా వుంది. ఉప్పు ప్రపంచ ఆరోగ్య సంస్ధ మేరకు రోజుకు 5 గ్రాములే తినాలి. పట్టణ ప్రాంతాలలో కొత్తగా వస్తున్న సూపర్ మార్కెట్ల వలన ఉప్పు వినియోగం అధికమైందని తేలింది. ప్రాసెస్డ్ ఆహారాలలో ఉప్పు అధికంగా వుంటోందట. ఇండియాలో వంట నూనెల వినియోగం 1990 -92 లో 5.8 మిలియన్ టన్నులు కాగా 2000-2001 నాటికి 9.7 మిలియన్ టన్నులుగా 2007 – 08 నాటికి మరింత అధికమై 14.3 మిలియన్ టన్నులుగా చేరిందని ఈ నివేదిక వెల్లడించింది.