కరోనావైరస్ కారణంగా పిల్లలు ఆన్లైన్లో ఎక్కువగా చదువుకోవలసి వస్తోంది. దీంతో స్క్రీన్ ల ఎదుట వారు గడిపే సమయం పెరగడం వల్ల వారి కళ్లపై ఒత్తిడి పెరుగుతోంది. నిరంతరం ఇలా ఆన్లైన్ క్లాసుల పేరిట స్క్రీన్ లను చూడడం వల్ల పిల్లల కంటి చూపు దెబ్బ తింటుందని జీఎస్వీఎం మెడికల్ కాలేజీ నిర్వహించిన పరిశోధనలలో తేలింది. దృష్టితో సంబంధం ఉన్న ప్రమాదం 3 రెట్లు పెరిగింది. జీఎస్వీఎం మెడికల్ కాలేజీ 700 మంది పిల్లలపై పరిశోధనలు నిర్వహించింది. అందులో 200 మంది పిల్లల కళ్ళు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు.
కోవిడ్ సమయంలో పిల్లలకు ఆన్లైన్ విద్య ఇబ్బందులను కలిగిస్తుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మొబైల్, టాబ్లెట్, ల్యాప్టాప్ స్క్రీన్లను నిరంతరం చూడడం వల్ల పిల్లల కళ్ళు పొడిబారుతున్నాయి. జీఎస్వీఎం మెడికల్ కాలేజీ పరిశోధనలో 200 మంది పిల్లల కళ్ళు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించగా, మిగిలిన పిల్లల కళ్ళకు ఇతర రకాల కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.
కరోనావైరస్ మొదటి వేవ్ కంటే ఈ సంవత్సరం పరిస్థితి మరింత ఆందోళనను కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతకు ముందు పిల్లలు 6 గంటల పాటు నిరంతరాయంగా స్క్రీన్లను చూస్తే కళ్లు పొడిబారేవని, కానీ ఇప్పుడు ఆ సమయం రెండున్నర నుండి 3 గంటలకు మారిందన్నారు. అందువల్ల ప్రస్తుతం చిన్నారులు తెరలను కొంత సేపు చూసినా కళ్లు పొడిబారుతున్నాయని, ఇది మరింత ప్రమాదమని చెబుతున్నారు. దీంతో పిల్లలు, యుక్త వయస్సులో ఉన్న విద్యార్థులకు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం 2 నుండి 3 రెట్లకు పెరిగిందని చెబుతున్నారు.
ఆన్లైన్ క్లాసుల వల్ల కళ్ళు త్వరగా అలసిపోతున్నాయని జీఎస్వీఎం మెడికల్ కాలేజీలోని ఆప్తాల్మాలజీ విభాగం అందజేసిన నివేదిక ఫలితాలు వెల్లడించాయి. ఆన్లైన్ క్లాసులతో పాటు మొబైల్స్లో ఆటలు ఆడడం వల్ల కూడా పిల్లల కళ్లపై ప్రభావం చూపుతోంది.
మొబైల్ గేమ్స్ కారణంగా 2 నుంచి 15 శాతం మంది పిల్లలకు హై పవర్ గ్లాసెస్ అవసరమవుతున్నాయని తెలిపారు. వారి కళ్ళ నుంచి నీళ్ళు ఎక్కువగా వస్తున్నాయిన, అలాగే కళ్లు పొడిబారి దురద పెడుతున్నాయని అన్నారు. దీంతో సుమారుగా 200 మంది పిల్లల కంటి చూపు తగ్గిందని గుర్తించారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, డిజిటల్ తెరలు కళ్లపై ఒత్తిడిని కలిగిస్తాయి. దీంతో కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వస్తుంది. ఎందుకంటే మొబైల్ కూడా కంప్యూటర్ లాంటి పరికరం. కంప్యూటర్, టాబ్లెట్, ఇ-రీడర్, స్మార్ట్ఫోన్లను సుదీర్ఘంగా ఉపయోగించడం వల్ల కళ్ళలో ద్రవాలు తగ్గి పొడిగా మారుతాయి. ప్రారంభ లక్షణాల ప్రకారం, పిల్లలు కంటి ఒత్తిడి కారణంగా ఆందోళన, డిప్రెషన్లను ఎదుర్కొంటారు. దీంతోపాటు చూపు సరిగ్గా ఉండడం లేదని చెబుతుంటారు. అలాగే తలనొప్పి, తరచూ నీరు తాగడం, మెడ, వీపు, భుజం నొప్పులు వస్తాయి.
ఈ సమస్యలను నివారించడానికి కంప్యూటర్ స్క్రీన్లపై యాంటీ గ్లేర్ గ్లాసెస్ ను ఉపయోగించాలి. స్క్రీన్ను కంటి స్థాయి కంటే 20 డిగ్రీల కింద ఉంచాలి. ప్రతి 2 గంటలు గడిచిన తరువాత కళ్ళకు 15 నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలి. ప్రతి 20 నిమిషాల తర్వాత 20 సెకన్ల విరామం తీసుకోవాలి. ఆ 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉండే వస్తువులను చూడాలి. ఇక పిల్లలకు ఆహారంలో పండ్లు, అవిసె గింజలు, సోయాబీన్, బ్రోకలీ, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, చేపలను ఇవ్వాలి. దీంతో పిల్లల కళ్ళను సంరక్షించుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365