మెంతి గింజలను వేయడం వల్ల అనేక వంటకాలకు చక్కని రుచి వస్తుంది. వీటిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఎంతో పురాతన కాలం నుంచి మెంతులను అనేక అనారోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తున్నారు. మెంతుల వల్ల చర్మాన్ని కూడా సంరక్షించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
* నానబెట్టిన మెంతి గింజలను పేస్ట్గా చేసి ముఖానికి మాస్క్ లా వేసుకోండి. లేదా ఒక టేబుల్ స్పూన్ మెంతి గింజల పొడిని కొద్దిగా పాలతో కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి మాస్క్ లా వేసుకోండి. తరువాత కొంత సేపటికి కడిగేయండి. ఇలా చేస్తుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
* మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి పేస్ట్గా చేయండి. ఫేషియల్ మాస్క్ లా అప్లై చేయండి. కొంత సేపటి తరువాత కడిగేయండి. ఇలా చేస్తుంటే చర్మం లోతుగా శుభ్రమవుతుంది. చర్మంపై ఉండే మృత కణాలు, దుమ్ము, ధూళి పోయి చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.
* మెంతి గింజలను నానబెట్టిన నీటిని స్కిన్ టోనర్గా కూడా ఉపయోగించవచ్చు. స్ప్రే బాటిల్లో ఆ నీటిని నిల్వ చేసుకుని అప్పుడప్పుడు ముఖంపై స్ప్రే చేసుకుంటుండాలి. దీంతో చర్మం మృదువుగా, తేమగా ఉంటుంది.
* నానబెట్టిన మెంతి గింజలను పేస్ట్లా చేసి దాన్ని స్క్రబ్గా చర్మంపై రుద్దండి. దీంతో మృత చర్మ కణాలు తొలగిపోతాయి. ముఖానికి కాంతి వస్తుంది.
* మెంతి గింజలలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి అవి మొటిమలతో పోరాడటానికి ఉపయోగపడతాయి. కొన్ని మెంతులను పెద్ద మొత్తంలో నీటిలో 15 నిమిషాల పాటు ఉడకబెట్టండి. నీటిని వడకట్టి చల్లబరచండి. తర్వాత మీ చర్మంపై కాటన్ బాల్తో ఆ ద్రవాన్ని రాయండి. కొంత సేపటి తరువాత కడిగేయండి. ఇలా చేస్తుంటే మొటిమలు తగ్గుతాయి.