తోటకూర కాడలను చాలా మంది అంత ఇష్టంగా తినరు. కానీ వీటితో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. తోటకూరను తరచూ ఆహారంలో భాగంగా చేసుకుంటే షుగర్, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక తోటకూర కాడలతో కూరను ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారు చేయాలో, ఇందుకు ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావల్సిన పదార్థాలు..
తోటకూర కాడలు లేతవి తగినన్ని, యాలక్కాయలు 3, ఉల్లిపాయలు 2, లవంగాలు 4, రెండు నూనె.. 3 టీస్పూన్లు, దాల్చిన చెక్క కాస్తంత, ఉప్పు, కారం తగినంత, గసగసాలు 2 టీస్పూన్లు, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి 4 రెబ్బలు, ఆవాలు 1/4 టీస్పూన్, జీలకర్ర 1 టీస్పూన్, మినప్పప్పు 1 టీస్పూన్.
తయారీ విధానం..
ముందుగా తోటకూర కాడలను కడిగి ముక్కలు చేసుకోవాలి. ఉల్లిపాయల్ని కూడా కడిగి చిన్న ముక్కలుగా కోయాలి. మసాలా దినుసులన్నీ పొడికొట్టుకుని వుంచుకోవాలి. అల్లం వెల్లుల్లిని మెత్తగా నూరి ముద్దగా చేసుకోవాలి. పొయ్యిమీద బాణెలి పెట్టి అందులో నూనె వేయాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు బాణెలిలో వేసి పోపు పెట్టాలి. తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేయించిన, తర్వాత తోటకూర కాడల ముక్కలను వేయాలి. కాసేపు వేగాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలా పొడి, ఉప్పు, కారం, ముక్కలపై జల్లి, అవసరమైనంత నీరు పోసి కొంచెం సేపు బాగ ఉడకనివ్వాలి. సెగమీద నుండి దింపుకున్న తర్వాత కొత్తిమీర జల్లుకోవాలి.