సత్యం అంటే నిజం. పాలన, విధివిధానాల్లో నీతి, నిజాయితీకిగాను ప్రతిష్ఠాత్మక గోల్డెన్ పీకాక్ బహుమతిని రెండు సార్లు గెలుచుకుంది సత్యం. 50,000 పైచిలుకు ఉద్యోగులతో 60 దేశాల్లో కార్యాలయాలతో మన దేశపు నాలుగవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా విరాజిల్లింది సత్యం. E&Y Entrepreneur Of The Year, 2008 అవార్డుకు ఎంపికయ్యారు రామలింగరాజు. దాదాపు ప్రతీరోజు ఉదయం 6 గంటలకు హైదరాబాదులో ఐటీ సంస్థల పెట్టుబడులకు అనుకూలంగా రాష్ట్రానికి నిధులు సమకూర్చే ప్రణాళికపై నేరుగా అప్పటి ముఖ్యమంత్రితో చర్చలకు వెళ్ళేవారాయన. మరి అంత మందిని అన్ని రోజులు అంత తేలిగ్గా ఎలా మోసం చెయ్యగలిగారు? తొమ్మిదేళ్ళలో 7,561 నకిలీ బిల్లులు, బ్యాంకు స్టేట్మెంట్లతో సంస్థ లెక్కల్లో సుమారు 7,000 కోట్ల రుపాయలు తారుమారు చేశారట రాజు. ఎందుకు? ఎలా?
ముందు కాస్త నేపథ్యం. 1987లో రామరాజు, రామలింగరాజు సోదరులు 20 మంది ఉద్యోగులతో ఐటీ, బీపీవో సేవలకు స్థాపించిన సంస్థ సత్యం కంప్యూటర్ సర్వీసెస్. 1991లో BSEలో లిస్ట్ అయిన వెంటనే ఫార్ట్యూన్ 500 సంస్థ అయిన Deere & Coను క్లయింట్గా పొందాక తిరుగులేని వృద్ధి మార్గాన దూసుకెళ్ళింది. సంస్థ విలువ 2003లో బిలియన్ డాలర్లు దాటి 2008 ఆర్థిక మాంద్యం సమయానికి 2 బిలియన్ డాలర్లు అయింది. ఆ కాలంలో ఏటా ఆదాయం 40%, లాభాలు 21% వృద్ధితో సంస్థ షేర్లు 300% పెరిగాయి. అప్పుడు మొదలైంది తీగ లాగితే డొంక కదిలే ప్రక్రియ. అంతటికీ మూలకారణం రియల్ ఎస్టేట్. 1988లోనే మేటాస్ పేరుతో (Satyam తిరగేస్తే Maytas) ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించాడు రామలింగరాజు.
2000 దశకం మొదలయే నాటికి రియల్ ఎస్టేట్ అంటే బంగారు బాతు బాపతు. ఆ వేలంవెర్రి రాజు గారినీ వదల్లేదు. పైగా ప్రభుత్వంలో పెద్ద తలలతో దోస్తీ ఉండనే ఉంది. అలా త్వరలో రాబోయే మెట్రో గురించి ముందుగానే వివరాలు తెలిసే సరికి సత్యంలో నుంచి నిధులను మేటాస్కు తరలించి నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టాడు. అసలా నిధులు సత్యంకు ఎక్కడివి? ఇది స్కామ్ అర్థం చేసుకోటానికి కీలకమైన వివరం. కొన్ని క్షణాల్లో ఈ వివరం చూద్దాం. 2008లో సత్యం బోర్డు 300 మిలియన్ డాలర్లకు మేటాస్ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. అసలు ఐటీ సంస్థకు రియల్ ఎస్టేట్ సంస్థను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఏముందని ఇన్వెస్టర్లు ప్రశ్నించారు – ఫలితంగా షేరు కాస్త పతనమైంది. ఈ దెబ్బకు బోర్డు ప్రయత్నాన్ని విరమించుకున్నా సాఫీగా నడుస్తున్న సంస్థ ఇలాంటి అసంబద్ధ చర్య తీసుకోవటం ఏమిటని ప్రశ్నించిన వరల్డ్ బ్యాంకు తన అనుబంధ సంస్థలేవీ ఎనిమిదేళ్ళ పాటు సత్యంతో వ్యాపార లావాదేవీలు సాగించకూడదన్న ఆజ్ఞ జారీ చేసింది.
దెబ్బకు షేరు ధర మరింత పతనమైంది. వరల్డ్ బ్యాంకు చర్య నిరాధారమని, ఆ చర్య పర్యవసానాన తమ సంస్థపై ఇన్వెస్టర్ల నమ్మకం సన్నగిల్లినందుకు వరల్డ్ బ్యాంకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది సత్యం బోర్డు. అసలు మేటాస్ను కొనుగోలు చెయ్యాల్సిన అవసరం సత్యంకు ఏమిటి? ఇది స్కామ్ అర్థం చేసుకోటానికి మరొక కీలకమైన వివరం. పైన చెప్పుకున్న నిధుల వివరం ఇప్పుడు చూద్దాం. 1999 నుంచే రామలింగరాజు తన వ్యక్తిగత కంప్యూటర్ నుండి నకిలీ బిల్లులు, బ్యాంకు స్టేట్మెంట్లను సృష్టించి సత్యం ఆదాయ, లాభాలను ఎక్కువగా చూపటం మొదలు పెట్టాడు. ఫలితంగా సంస్థ విలువ, షేరు ధర పెరుగుతూ పోయింది. అలా పెరిగిన ప్రతి సారీ యజమాని హోదాలో తనకు జారీ చేయబడిన షేర్లను పలు విడతల్లో ఎక్కువ ధరకు అమ్ముతూ వచ్చాడు.
పైగా నకిలీ ఉద్యోగులను, వారికి జీతాలిస్తున్నట్టు ఋజువులను సృష్టించి నెలకు దాదాపు ముప్పై లక్షలు సంస్థ నుండి తీసుకుంటూ వచ్చాడు. ఈ నిధులన్నీ మెట్రో ప్రాజెక్టు దక్కించుకున్న మేటాస్లో పెట్టుబడికి వాడాడు. మెట్రో పూర్తయితే మేటాస్కు లాభాల పంట పండుతుంది కాబట్టి అలా వచ్చిన లాభాలతో సత్యం నుండి మళ్ళించిన నిధులను మళ్ళీ అక్కడికే మళ్ళించి తతంగాన్ని నిశ్శబ్దంగా ముగిద్దాం అనుకున్నాడు. అయితే అప్పటికే అమెరికాలోని రియల్ ఎస్టేట్ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంగా పరిణమించటం మొదలైంది. ఆ దెబ్బకు మెట్రో పనులు నెమ్మదించాయి. ఎప్పుడు పూర్తవుతాయో తెలియదు. సుమారు బిలియన్ డాలర్ల అప్పు కేవలం పుస్తకాల్లో ఉన్న నకిలీ లాభాలతో తీర్చటం అసంభవం.
సరిగ్గా ఆ సమయానికి అప్పటికే తొమ్మిదేళ్ళుగా సాగుతున్న నకిలీ బిల్లులు, నిధుల మళ్లింపు గురించి ఒక ఆకాశరామన్న ఈ-మెయిల్ సంస్థ డైరెక్టర్లలో ఒకరైన కృష్ణ పాలెపుకు పంపబడింది. ఆయన ఆ ఈ-మెయిల్ను సత్యం ఆడిటర్లయిన PWCలోని గోపాలకృష్ణన్కు పంపి, అదంతా అబద్ధమని ఋజువు చేసేందుకు 2008, డిసెంబరు 29న ఆడిటర్లతో మీటింగ్ ఏర్పాటు చేసారు. ఆ మీటింగ్ బహిరంగపరచని కారణాలతో జనవరి 10కి వాయిదా పడింది. ఆ పరిస్థితిని దాటేందుకు రాజు ముందున్న ఒకే ఒక దారి సత్యం మేటాస్ను కొనుగోలు చేసి గందరగోళం మొత్తం పూడ్చి పెట్టే ప్రయత్నం. అది కాస్తా మదుపర్లు తిరస్కరించటంతో బెడిసికొట్టింది. జనవరి 7, 2009న రాజు ఏళ్ళుగా తాను సంస్థ ఆదాయలాభాలను ఎక్కువ చేసి చూపినట్టు చెబుతూ తన రాజీనామా బహిరంగంగా సమర్పించాడు.
దేశంలోని అత్యుత్తమ సంస్థల్లో ఒకటిగా ఖ్యాతి, బహుమతి పొందిన సత్యం మేడిపండు అన్న విషయం బట్టబయలైంది. రాజు ఇంటిని సోదా చేసిన సీబీఐ చేతికి 13,000 నకిలీ ఉద్యోగులను సృష్టించిన ఋజువులు దొరికాయి. అసలు అన్నేళ్ళుగా PWC ఆడిటర్లు సంస్థలోని మోసాన్ని కనుగొనలేకపోవటం ప్రపంచాన్ని విస్మయ పరిచింది. వారు అంత పెద్ద మోసాన్ని చూసీచూడనట్టు ఉండటానికి పుచ్చుకున్న నజరానా అన్నేళ్ళుగా రెండింతలు ఫీజు. ఇదంతా ఋజువయ్యాక PWC లైసెన్స్ రెండేళ్ళ కాలానికి రద్దు చేయబడింది. ఫలితంగా వారు ఆడిట్ చేసిన సంస్థలన్నిటి షేర్లు 15% మేర పతనమయ్యాయి. 2008లో 544 రుపాయలున్న సత్యం షేర్లు 11 రుపాయలకు పడ్డాయి. సెన్సెక్స్ సైతం 7% పడింది. నష్టాన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వం స్వయంగా సత్యంను 100 రోజుల్లో ఏదోక సంస్థకు అమ్మివేయాలన్న ఆదేశాలతో ఒక కమిటీని నియమించింది. తుదకు సత్యం టెక్ మహీంద్రా గూటికి చేరింది.