నేటి రోజులలో మహిళలు అందానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఉద్యోగస్తులైన మహిళలైతే, అందానికి సంబంధించి ఎంతో సమయాన్ని, సొమ్మును కూడా వెచ్చిస్తున్నారు. అందంగా కనపడాలంటే ప్రధానంగా చర్మ సంరక్షణ ఎంతో అవసరం. రోజంతా తాజాదనంతో మెరిసిపోయేందుకు ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు. అలాంటి వారు మీరైతే ఈ కథనం చదవాల్సిందే.
బకెట్ నీటిలో ఒక కప్పు పాలపొడి వేసి స్నానం చేయండి. లేదా స్నానము చేసే ముందు చర్మానికి పచ్చిపాలు రాసుకుని చూడండి . చర్మం పట్టులా ఎంతో మృదువుగా తయారవుతుంది. అలాగే కాస్తంత కలబంద గుజ్జును బకెట్ నీటిలో వేసి స్నానం చేస్తే.. ఎండ కారణంగా కమిలిన చర్మానికి మంచి మాయిశ్చరైజర్గా ఉపయోగపడటమే గాక, అందులోని సుగుణాలు చర్మానికి తేమనందిస్తాయి.
రోజులోని అలసట దూరం కావాలంటే సాయంత్రమయ్యే సరికి గుప్పెడు తులసి ఆకుల్ని నీళ్లలో వేసుకుని స్నానం చేస్తే సరిపోతుంది. రోజంతా ఆనందంగా వుంటుంది. శరీరాన్ని శుభ్రపరచడంతో పాటు మృదువుగా, ప్రకాశవంతంగా మార్చడంలో కామొమైల్ ఉపయోగపడుతుంది. అందుకే వారానికొకసారి పదిచుక్కల కామొమైల్ నూనెను నీటిలో వేసుకుని స్నానం చేస్తే పొడిగల చర్మంగల వారికి స్వాంతన ఇస్తుంది. దీనివల్ల అలసత్వం కూడా దూరమౌతుందని బ్యూటీషియన్లు సూచిస్తున్నారు.