Heat : సాధారణంగా చాలా మందికి వేడి శరీరం ఉంటుంది. వారి చర్మాన్ని ఎప్పుడు టచ్ చేసినా వేడిగా అనిపిస్తుంటుంది. అయితే కొందరికి వారు పాటించే జీవనశైలి వల్ల శరీరం ఇలా వేడిగా అవుతుంది. కానీ కొందరు తినే ఆహారాల వల్ల లేదా నీటిని ఎక్కువగా తాగకపోవడం వల్ల శరీరం వేడిగా అవుతుంటుంది.
అయితే శరీరంలో వేడి అనేది ఆహారం వల్లే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మసాలాలు, కారం, ఉప్పు ఉన్న ఆహారాలను ఎక్కువగా తిన్నా, జంక్ ఫుడ్, నూనె పదార్థాలను ఎక్కువగా తీసుకున్నా, మద్యం ఎక్కువగా సేవించినా, మాంసాహారాన్ని ఎక్కువగా తిన్నా శరీరం వేడిగా అవుతుంది. ఇక నీటిని ఎక్కువగా తాగకపోయినా శరీరం వేడిగా అవుతుంది.
శరీరంలో వేడి ఎక్కువైతే మూత్రం తక్కువగా వస్తుంది. లేదా కొందరికి మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపిస్తుంది. అలాగే మూత్రం పసుపు రంగులో వస్తుంది. ఇక కొందరిలో మూత్రాశయ ఇన్ఫెక్షన్లు కూడా వస్తుంటాయి. కొందరికి వేడి ఎక్కువగా ఉంటే శరీరం కాలినట్లు అనిపిస్తుంది. కానీ వారికి ఆ విషయం తెలియదు. ఇక మరికొందరికి పాదాల పగుళ్లు, చర్మం పగుళ్లు ఎక్కువగా వస్తాయి. ఈ విధంగా శరీరంలో వేడి ఉంటే గుర్తించవచ్చు.
అయితే శరీరంలో ఎంతటి వేడి ఉన్నా కీరదోసను మూడు పూటలా తీసుకుంటే వెంటనే వేడి తగ్గుతుంది. పూటకు ఒక కీరదోసను తినాలి. లేదా దాన్ని జ్యూస్ రూపంలోనూ తీసుకోవచ్చు. అలాగే పుదీనా ఆకుల రసాన్ని ఉదయం పరగడుపున 30 ఎంఎల్ మోతాదులో తాగాలి. మధ్యాహ్నం భోజనం అనంతరం 2 గంటల విరామం ఇచ్చి తర్బూజా పండ్లకు చెందిన జ్యూస్ను తాగాలి.
పుచ్చకాయలు, సొరకాయలు, బీరకాయలు, పొట్ల కాయలు వంటి నీరు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటున్నా శరీరంలోని వేడి తగ్గిపోతుంది. అలాగే రోజూ కనీసం 3-4 లీటర్ల నీటిని తాగాలి. దీంతోపాటు నారింజ, బత్తాయి, ద్రాక్ష వంటి పండ్లను కూడా తినాలి. దీంతో కూడా వేడి తగ్గుతుంది.
ఇక వేడిని తగ్గించడంలో రాగి జావ, కొబ్బరినీళ్లు కూడా బాగానే పనిచేస్తాయి. రోజూ రెండు పూటలా వీటిని తీసుకుంటే సమస్య నుంచి బయట పడవచ్చు.