వయస్సు మీద పడుతున్న కొద్దీ అనేక రకాల వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తుంటాయి. వయస్సు మీద పడిన వారు బయటకు వెళ్తే ఎక్కడ పడిపోతామేమోనన్న భయంతో ఇంటికి పరిమితం అవుతారు. దీంతో అజీర్తి, కడుపు ఉబ్బరంగా ఉండటం సర్వసాధారణం. అజీర్తి క్రమంగా మలబద్ధకానికి, శరీరం రోగ గ్రస్తం కావడానికీ దారి తీస్తుంది. అందుకే రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. కడుపు ఉబ్బరాన్ని కలిగించే పదార్థాలను గుర్తించి, వాటికి దూరంగా ఉండడం 60 దాటిన వారంతా చేయాల్సిన పని అంటున్నారు పోషకాహార నిపుణులు. ముదుమిలో కొంపముంచే అలవాట్లు, ఆహారం ఏమిటో చూద్దాం.
సిట్రిక్ ఆమ్లం అధికంగా ఉండే బత్తాయి, నిమ్మకాయ, టమాటాలను తినకూడదు. మద్యపానం, పొగతాగడం మానుకోవాలి. మలబద్ధకాన్ని నివారించేందుకు పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకు కూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. జామ, అరటి పళ్లు కూడా తీసుకోవాలి. మొలకెత్తిన గంజలు శ్రేష్ఠం. రోజూ తప్పని సరిగా మొలకెత్తిన గింజలు తినాలి. నీళ్లు బాగా తాగాలి. రాత్రివేళ తరుచూ మూత్రవిసర్జనకు వెళ్లే సమస్య ఉంటే నిద్రాభంగం కావచ్చు. అలాంటి వారు పగటి పూట నీళ్లు బాగా తాగి, రాత్రివేళ తీసుకునే మోతాదు తగ్గించాలి.
దంత సమస్యలు ఉన్న వారు కాస్త ఎక్కువగా ఉడికించిన పదార్థాలను, రాగి జావ, పెరుగు అన్నం లాంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. గట్టి పదార్థాలను తీసుకునే మోతాదు తగ్గించాలి. బాగా నమిలి తినడం ద్వారా ఉబ్బరం సమస్య చాలా వరకు దూరంగా ఉంటుంది. దంతాలు పూర్తిగా పోయిన వారు కృత్రిమ దంతాలు వాడటం చాలా అవసరం.