నేటి రోజుల్లో కూల్ డ్రింక్ తాగని వారు లేరు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు రోజులో ఏదో ఒక సమయంలో కూల్ డ్రింక్ తాగేయటం అలవాటుగా మారిపోతోంది. అయితే, కూల్ డ్రింక్ లు అధికమైన కేలరీలనందిస్తాయని, ప్రత్యేకించి రోజుకు రెండు లేదా అంతకు మించి తియ్యటి కూల్ డ్రింక్ లు తాగితే మహిళల నడుము భాగాలు కొవ్వు పట్టటమే కాక గుండె సంబంధిత వ్యాధులకు, డయాబెటీస్ కు గురవుతారని తాజాగా చేసిన ఒక కొత్త అధ్యయనం తెలిపింది.
ఈ రకంగా కూల్ డ్రింక్ లు తీసుకునేవారిలో గ్లూకోజ్ లెవెల్ పెరిగి ట్రిగ్లీసెరైడ్స్ నాలుగురెట్లు పెరుగుతాయని రీసెర్చర్లు తెలిపారు. అయితే ఈ మార్పులు పురుషులలో లేవని తెలిపారు. మహిళలకు కూడా నడుము కొలతలు పెరుగుతున్నాయి కానీ బరువు పెరగటం లేదని అధ్యయన కర్త క్రిస్టినా షయ్ తెలిపారు. మహిళలు తియ్యటి డ్రింకుల నుండి గుండె జబ్బులు తెచ్చుకునే ప్రమాదం వుందని దానికి కారణం పురుషులకంటే కూడా మహిళలకు తక్కువ కేలరీలు అవసరమని అన్నారు.
మహిళలు తాగే తియ్యటి కూల్ డ్రింకులలో వారికి అధికమయ్యే ప్రతి కేలరీ వారిలో గుండె సంబంధిత రోగాలను ప్రోత్సహిస్తోందని డా. షయ్ తెలిపారు. కనుక మహిళలు కూల్ డ్రింక్ తాగాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి తాగటం ఆరోగ్యానికి మంచిదని భావించవచ్చు.