గొల్లల మామిడాడ.. ఈ గ్రామాన్ని గోపురాల మామిడాడ అని కూడా అంటారు. ఈ గ్రామాన తెలుగు నాట సూర్య దేవాలయము, రామాలయం ఉన్నాయి. కాకినాడకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో గొల్లల మామిడాడ అన్న గ్రామంలో ఈ ఆలయం ఉంది. మామిడాడ రామాలయంలో రెండు గాలి గోపురాలు ఉన్నాయి. అవి రెండూ కూడా ఎంతో ఎత్తుగా ఉండి ఆకాశాన్ని అంటుకుంటున్నాయా అన్నట్టుగా ఉంటాయి. ఈ రెండు తూర్పు, పడమర దిక్కులలో ఎదురెదురుగా ఉంటాయి. దీనిలోమొదటిది 1950వ సంవత్సరంలో నిర్మించిన గాలి గోపురం 9 అంతస్తులతో 160 అడుగుల ఎత్తు ఉంటుంది. రెండవ గాలిగోపురం 1958వ సంవత్సరంలో 13 అంతస్తులతో 200 అడుగుల ఎత్తు ఉంటుంది.
వీటి ప్రత్యేకత ఏమిటంటే ఈ గోపురాల క్రింద నుండి పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. మెట్లు ఎక్కి గోపురం పైకి చేరిన తరువాత ఆ పైనుంచి చూస్తే చుట్టూ 25కి.మీ దూరం నుండి కనిపించే పచ్చని పంటలు, కాలువలు, కాకినాడ ప్రాంతం, ఇలా ఎన్నో ప్రకృతి రామణీయతలను వీక్షించవచ్చు.
ఇంకా ఆ గోపురాల ముఖ్య విశిష్టత ఆ గోపురాలపై ఉన్న శిల్ప సౌందర్యం. గోపురాలపై ఉన్నశిల్పాలు రామాయణ, మహాభారత కధా వృత్తాన్ని శిల్పాల రూపంలో ఎంతో మనోహరంగా, సుందరంగా అమర్చారు. ఆ శిల్ప సౌదర్యం చూస్తూ ఉంటే ఆనాటి రామాయణ, మహాభారత విశేషాలను కళ్ళకు కట్టినట్లుగా అకాలంలోనికి మనల్ని తీసుకోని పోతాయి.
మామిడాడ గ్రామం కాకినాడకు 20కి.మీ దూరం, రాజమండ్రికి 58కి.మీ దూరం , సామర్లకోటకు 17కి.మీ దూరంలో ఉంటుంది. కాకినాడ, రాజమండ్రి, సామర్లకోట వరకు రైలు సౌకర్యం ఉంది. అక్కడ నుండి బస్సులు, ఆటోలు, ఇతర ప్రెవేటు వాహనాల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు.