మన శరీరంలో ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం అవసరం అవుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కాల్షియంను ఎక్కువగా పొందవచ్చు. అయితే కొందరికి కాల్షియం లోపం సమస్య వస్తుంటుంది. దీంతో వైద్యుల వద్దకు వెళితే వారు సప్లిమెంట్లను ఇస్తారు. వారు చెప్పినట్లుగా ఆ ట్యాబ్లెట్లను వాడుతూ, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కాల్షియం లోపం నుంచి బయట పడవచ్చు. కానీ కొందరు అవసరం ఉన్నా, లేకున్నా కాల్షియం ట్యాబ్లెట్లను వాడుతుంటారు. ఇది ప్రమాకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మన శరీరానికి కాల్షియం అవసరమే. కానీ దాన్ని తగిన మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ కొందరు అవసరం లేకపోయినా అధిక మొత్తంలో కాల్షియం ఉండే పదార్థాలను తీసుకుంటుంటారు. అలాగే కాల్షియం ట్యాబ్లెట్లను వాడుతారు. ఇది మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పురుషులకు నిత్యం 1000 నుంచి 1200 మిల్లీగ్రాముల మోతాదులో కాల్షియం అవసరం ఉంటుంది. అదే స్త్రీలు అయితే నిత్యం 1200 నుంచి 1500 మిల్లీగ్రాముల మోతాదులో కాల్షియం తీసుకోవాలి. పిల్లలకు 1300 నుంచి 2500 మిల్లీగ్రాముల మోతాదులో కాల్షియం అవసరం అవుతుంది. ఈ మోతాదులోనే నిత్యం కాల్షియం అందేలా చూసుకోవాలి. ఎక్కువైతే దుష్పరిణామాలు కలుగుతాయి.
శరీరంలో కాల్షియం పరిమాణం ఎక్కువైతే కిడ్నీలు దాన్ని ఫిల్టర్ చేయలేవు. ఫలితంగా కిడ్నీ స్టోన్స్ ఏర్పడుతాయి. అలాగే బీపీ పెరుగుతుంది. ఎముకలకు దృఢంగా మారకపోగా పెళుసుగా మారుతాయి. దీంతో అవి సులభంగా విరిగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మెదడు పనితీరు దెబ్బతింటుంది.
కనుక ఎవరైనా సరే అవసరం ఉన్న మోతాదులో మాత్రమే అది కూడా డాక్టర్ల సలహా మేరకు కాల్షియం ట్యాబ్లెట్లను వాడాల్సి ఉంటుంది. అలాగే నిత్యం కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎక్కువైతే పైన తెలిపిన అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.