కారం, మసాలాలు ఉండే ఆహారాలను అధికంగా తిన్నా లేదా అజీర్ణం వల్ల.. మాంసాహారాలను, కొవ్వు పదార్థాలను ఎక్కువగా తిన్నా.. చాలా మందికి సహజంగానే కడుపులో మంట వస్తుంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల కడుపులో మంటను తగ్గించుకోవచ్చు. దీంతోపాటు గ్యాస్ సమస్య కూడా తగ్గుతుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
* కడుపులో మంటగా ఉంటే కొబ్బరి నీళ్లను తాగుతుండాలి. దీని వల్ల జీర్ణాశయం చల్లబడుతుంది. మంట తగ్గుతుంది. గ్యాస్ సమస్య పోతుంది. పూటకు 1 గ్లాస్ కొబ్బరినీళ్లను తాగితే సమస్య తగ్గుతుంది.
* అల్లంలో యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల కడుపులో మంటను తగ్గిస్తుంది. కడుపులో మంట, గ్యాస్ ఉంటే భోజనానికి ముందు 1 టీస్పూన్ అల్లం రసాన్ని తాగుతుండాలి. దీంతో ఆయా సమస్యలు తగ్గుతాయి.
* కడుపులో మంటను తగ్గించడంలో అరటి పండ్లు కూడా బాగానే పనిచేస్తాయి. కడుపులో మంటగా ఉంటే ఒక అరటి పండును తిని చూడాలి. పూటకు ఒక పండును తింటే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
* కలబంద రసం కూడా కడుపులో మంటను తగ్గిస్తుంది. రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు 30 ఎంఎల్ మోతాదులో ఆ రసం తాగుతుంటే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* సోంపు గింజలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగుతుండాలి. లేదా గ్రీన్ టీ తాగవచ్చు. దీంతో కూడా కడుపులో మంట, గ్యాస్ తగ్గుతాయి.
* పుదీనా లేదా కొత్తిమీర ఆకులను కొన్ని తీసుకుని నేరుగా నమిలి మింగేయాలి. లేదా రసం తీసి 30 ఎంఎల్ మోతాదులో తాగవచ్చు. దీంతో సమస్యలు తగ్గుతాయి.
* కడుపులో మంటగా ఉంటే మజ్జిగను సేవించవచ్చు. మజ్జిగ బాగా పలుచగా ఉండేలా తయారు చేసుకుని తాగుతుండాలి. పూటకు ఒకసారి తాగాలి.
కడుపులో మంట, గ్యాస్ ఉంటే తగ్గే వరకు వేపుళ్లను మానేయాలి. కొవ్వు పదార్థాలను తీసుకోరాదు. కాఫీ, టీలను మానేయాలి. కారం, మసాలాలు ఉండే ఆహారాలను తినరాదు. శీతల పానీయాలను తాగరాదు. భోజనం చేసిన వెంటనే 10 నిమిషాల పాటు తేలికపాటి వాకింగ్ చేయాలి. రాత్రి భోజనం అనంతరం నిద్రకు కనీసం 3 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి.