కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం.. కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం.. ఆహార పదార్థాలు పడకపోవడం.. వంటి అనేక కారణాల వల్ల మనలో చాలా మందికి అప్పుడప్పుడు విరేచనాలు వస్తుంటాయి. అయితే వాటికి మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే చెక్ పెట్టవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
* నీళ్ల విరేచనాలు ఏర్పడినప్పుడు గడ్డ పెరుగు తినాలి. రోజులో కనీసం 2 నుంచి 3 కప్పుల పెరుగు తింటే నీళ్ల విరేచనాలు త్వరగా అదుపులోకి వస్తాయి. పెరుగులో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ నీళ్ల విరేచనాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. దీంతో విరేచనాలు తగ్గుతాయి.
* ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ను కలపాలి. దాంట్లో కొంత తేనె వేయాలి. అనంతరం ఆ ద్రవాన్ని బాగా కలిపి విరేచనాలు కట్టుకునేంత వరకు 2, 3 సార్లు తాగాలి. దీంతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
* ప్రతి 2 గంటలకు ఒక సారి బాగా మగ్గిన అరటి పండును తింటున్నా లేదా అరటి పండు, పెరుగులను కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని రోజులో 2, 3 సార్లు తీసుకుంటున్నా నీళ్ల విరేచనాలు అదుపులోకి వస్తాయి. లేదంటే ఒక పచ్చి అరటి పండును నీటిలో మరిగించి అనంతరం దాన్ని బాగా నలిపి దాంట్లో కొంత నిమ్మరసం, ఉప్పు వేసి తిన్నా విరేచనాలు తగ్గుతాయి.
* ఒకటిన్నర కప్పు నీటిలో 1 టేబుల్ స్పూన్ అల్లం మిశ్రమాన్ని వేసి ఆ నీటిని 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అనంతరం వచ్చే ద్రవాన్ని వడకట్టి తాగుతుంటే విరేచనాలు తగ్గిపోతాయి. లేదంటే ఎండిన అల్లం పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి కొద్దిగా, దాల్చిన చెక్క పొడి, తేనెలను కొంత మొత్తంలో తీసుకుని అన్నింటినీ బాగా కలిపి తింటున్నా విరేచనాలు తగ్గుతాయి.
* ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ పసుపును వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని తాగుతుంటే ఫలితం ఉంటుంది. లేదంటే 1 టేబుల్ స్పూన్ పెరుగులో 1 టీస్పూన్ పసుపును వేసి తింటున్నా విరేచనాలను తగ్గించుకోవచ్చు.
* ఒక పాత్రలో నీటిని తీసుకుని దాంట్లో తురిమిన అల్లం అర టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1 టీ స్పూన్ మోతాదులో వేసి ఆ నీటిని 30 నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని నిత్యం 2, 3 సార్లు తాగితే విరేచనాలు తగ్గుతాయి.
* ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ తేనె, అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిలను వేసి బాగా కలిపి తాగాలి. దీంతో కూడా విరేచనాలు తగ్గిపోతాయి.
* అరటి పండు లేదా పెరుగులో దాల్చిన చెక్క పొడిని కొద్దిగా చల్లి తిన్నా విరేచనాలు తగ్గుతాయి.
* దానిమ్మ పండు రసం కూడా నీళ్ల విరేచనాలను తగ్గిస్తుంది. దానిమ్మ పండు రసాన్ని తాగుతుంటే విరేచనాలు తగ్గుతాయి.