భార్యాభర్తలు అన్నాక వారి మధ్య మనస్పర్థలు రావడం సహజమే. ఈ క్రమంలో వారు కొన్ని సార్లు గొడవ పడ్డా మళ్లీ కలసి పోతారు. ఎందుకంటే జీవితం మొత్తం ప్రయాణించాల్సిన జంట కదా. కనుకే ఎలాంటి స్పర్థలు వచ్చినా సర్దుకుపోవాలి. అయితే ఇలా జరిగితే అంతా బాగానే ఉంటుంది. కానీ దంపతుల మధ్య వచ్చే అవే గొడవలు తారా స్థాయికి చేరి వారిద్దరూ కొట్టుకునే దాకా వస్తే..? అలాంటి స్థితిలో బలం ఉన్నవారిదే పై చేయి అవుతుంది. ఈ సందర్భంలో సహజంగా భర్తలకే ఎక్కువ బలం ఉంటుంది కాబట్టి వారే భార్యపై పైచేయి సాధిస్తారు. అది తిట్టడంలో అయినా, కొట్టడంలో అయినా. కానీ మన దేశంలో మాత్రం అలా కాదట. భార్యలదే పై చేయి అవుతోందట. అవును, మీరు విన్నది నిజమే.
దంపతుల మధ్య తలెత్తే గొడవల్లో మన దేశంలో అయితే భార్యలదే పై చేయి అవుతుందని ఈ మధ్యే తెలిసింది. సాక్షాత్తూ ఐక్యరాజ్య సమితే ఈ విషయాన్ని వెల్లడించింది. సదరు సంస్థకు చెందిన ప్రతినిధులు అనేక దేశాల్లోని ఫ్యామిలీ కోర్టుల్లో సర్వేలు చేశారట. చివరికి తెలిసిందేమిటంటే ఈజిప్టు, బ్రిటన్, భారత్లలో దంపతుల్లో భార్యలే భర్తలను హింసిస్తూ, కొడుతూ వారి నుంచి విడాకులు తీసుకుంటున్నారట. దీన్ని బట్టి వారు తేల్చిందేమిటంటే ఆ మూడు దేశాల్లో ఇప్పుడు భార్యా బాధితులు పెరిగిపోయారట. ఆ వరుసలో మన దేశానికి 3వ ర్యాంక్ రావడం గమనార్హం.
సాధారణంగా దంపతులు కొట్టుకునే స్థితి దాకా వస్తే అప్పుడు భర్తలు ఎక్కువగా చేతికే పని చెబుతున్నారట. కానీ భార్యలు మాత్రం చేతికి దొరికిన సూదులు, చీపుర్లు, గరిటెలు, గిన్నెలు, కిచెన్లో వాడే కత్తులు, చెప్పులు వంటి వస్తువులతో భర్తలపై దాడులు చేస్తున్నారట. ఈ క్రమంలో మన దేశంలో ఇటీవలి కాలంలో భార్యా బాధితులు ఎక్కువగా పెరుగుతున్నారని సదరు సంస్థ చేసిన సర్వేలో తేలింది. అయితే గృహ హింస విషయానికి వస్తే ఆడైనా, మగైనా ఒకటేనని, బాధితులు ఎవరైనా బాధితులే అని, వారికి న్యాయం జరగాలని సదరు సంస్థ భావిస్తున్నట్టు తెలిసింది. అంతే కదా మరి..! గృహ హింస చేస్తే అది స్త్రీ అయినా, పురుషడైనా విడిచి పెట్టకూడదు. ఎందుకంటే అందరికీ సమన్యాయం జరగాలన్నదే కదా, మన చట్టంలో ఉంది..!