lifestyle

ఆస్తినంతా అమ్మి రూ.4 కోట్లతో ప్రపంచయాత్ర టిక్కెట్టు కొంటే.. చివరకు..

క్రూయిజ్ నావలో ప్రపంచయాత్ర కోసం జాబ్‌కు రిజైన్ చేసి, ఆస్తిని అమ్మి మరీ టిక్కెట్టు కొనుకున్న ఓ మహిళకు చివరి నిమిషంలో ఊహించని షాక్ తగిలింది. ప్రపంచయాత్ర కోసం ఆశపడ్డ ఆమె జీవితం ఒక్కసారిగా తారుమారైంది. గతేడాది ఈ ఘటన జరగ్గా బాధితురాలిని మీడియా తాజాగా పలకరించింది. జరిగిన దానికి తానేమీ చింతించట్లేదని ఆమె చెప్పడంతో ఈ ఉదంతం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన మెరిడెన్ షే అనే మహిళకు ప్రపంచయాత్ర చేయాలని ఎప్పటి నుంచో కోరిక. ఈ నేపథ్యంలో గతేడాది లైఫ్ ఎట్ సీ అనే కంపెనీ ప్రకటించిన ఓ టూర్ ప్యాకేజీ ఆమెను అమితంగా ఆకట్టుకుంది. కంపెనీ ప్రకటన ప్రకారం, మూడేళ్ల పాటు సాగే ఈ జర్నీలో పర్యాటకులు క్రూయిజ్ నావలో ఏకంగా 135 దేశాలను చుట్టొస్తారు.

మెరిడెన్ షేకు పిల్లలు, మనవలు మనవరాళ్లు ఎవరూ లేకపోవడంతో డబ్బంతా సొంతానికి ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో, ఆమె తన చిరకాల కోరికను నెరవేర్చుకునేందుకు రెడీ అయిపోయింది. టిక్కె్ట్టు ధర రూ.4 కోట్లు అయినా వెరవకుండా డబ్బు సిద్ధం చేసుకుంది. ఇందుకు కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆపై తనకున్న ఒక్క ఇంటిని కూడా అమ్మేసింది. అలా వచ్చిన డబ్బుతో క్రూయిజ్ నావలోని ఏడో అంతస్తులోగల బాల్కనీ గదిని బుక్ చేసుకుంది. మరో ఇంటిని అద్దెకు తీసుకుని తన సామానంతా అక్కడ పెట్టింది. ఇక బయలుదేరడమే తరువాయి అని అనుకుంటున్న తరుణంలో లైఫ్ ఎట్ సీ సంస్థ నుంచి షాకింగ్ కబురు అందింది.

woman booked for cruise ship tour know what happened next

మొదట్లో చెప్పినట్టు ఫ్లోరిడాకు బదులు బహామాస్ నుంచి నావ ప్రయాణం మొదలవుతుందని సంస్థ పేర్కొంది. ఇది కొంత నిరాశపరిచినా ఆమె చివరకు సర్దుకుపోయింది. అయితే, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా పర్యటన రద్దైనట్టు మరోసారి సంస్థ కబురంపడంతో ఆమె హతాశురాలైంది. టిక్కెట్టు డబ్బును మూడు వాయిదాల్లో చెల్లిస్తామని కూడా కంపెనీ చెప్పడంతో చేసేదేం లేక మహిళ మిన్నకుండిపోయింది. చివరకు ఉండటానికి ఇల్లు కూడా లేక వీధుల పాలైంది. ఇది జరిగి ప్రస్తుతం ఏడాది కావస్తుండగా మీడియా ఆమెను మరోసారి పలకరించింది.అయితే, జరిగిన దానికి తానేమీ విచారపడట్లేదని ఆమె చెప్పుకొచ్చింది. భవిష్యత్తులో సౌదీ అరేబియా, దుబాయ్‌ల టూర్లకు కచ్చితంగా వెళ్లివస్తానంటూ ఆశాభావం వ్యక్తం చేసింది.

Admin

Recent Posts