Fruits : ఎప్పటికప్పుడు సీజన్లలో లభించే పండ్లను మనం రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. కొన్ని రకాల పండ్లు నిర్దిష్టమైన సీజన్లలోనే లభిస్తాయి. కనుక ఆ పండ్లను ఆయా సీజన్లలో తప్పక తినాలి. ఇక మనకు ఏడాది పొడవునా లభ్యమయ్యే పండ్లను కూడా రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.
ఆయుర్వేద ప్రకారం పండ్లు చాలా తేలికైన ఆహారం. అందువల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. పైగా పోషకాలు, శక్తిని అందిస్తాయి. అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తాయి. అధిక బరువును తగ్గిస్తాయి. అందువల్ల పండ్లను రోజూ తినాల్సిందే. అయితే ఆయుర్వేద చెబుతున్న ప్రకారం భోజనంతోపాటు పండ్లను తీసుకోరాదు.
పండ్లు చాలా తేలికైన ఆహారం. మనం తినే అన్నం, చపాతీలు, ఇతర ఆహారాలు, కూరలు.. జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. పండ్లు మాత్రం త్వరగా జీర్ణం అవుతాయి. అందువల్ల పండ్లను ఇతర ఆహారాలతో కలిపి తీసుకుంటే అవి జీర్ణం అయ్యేందుకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. దీంతో జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది.
పండ్లను భోజనంతోపాటు తింటే జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడి గ్యాస్, మలబద్దకం వస్తాయి. శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయి. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బ తింటుంది. కనుక భోజనంతోపాటు పండ్లను తినరాదని ఆయుర్వేదం చెబుతోంది.
ఇక భోజనానికి 2 గంటల ముందు లేదా భోజనం చేసిన అనంతరం 2 గంటల తరువాత పండ్లను తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధంగా పండ్లను తీసుకుంటే ఎలాంటి ఆటంకం ఏర్పడదు. వాటిల్లో ఉండే పోషకాలను కూడా శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. పండ్లను ఉదయం బ్రేక్ఫాస్ట్ అనంతరం 2 గంటల తరువాత లేదా సాయంత్రం సమయంలో స్నాక్స్కు బదులుగా తింటే మంచిదని చెబుతున్నారు.