Sarva Pindi : బియ్యప్పిండితో చేసే వంటకాలు సహజంగానే చాలా రుచిగా ఉంటాయి. అలాంటి వాటిలో సర్వపిండి ఒకటి. దీన్ని రెండు తెలుగు రాష్ట్రాల వాసులు చాలా ఇష్టంగా తింటారు. కారం, ఉప్పు, పచ్చిమిర్చి వేసి చాలా రుచిగా చేస్తారు కనుక సర్వపిండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అయితే కాస్త ఓపిక ఉండాలే కానీ ఎవరైనా దీన్ని సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి సర్వ పిండిని ఎలా తయారు చేయాలో.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందామా..!

సర్వపిండి తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యప్పిండి – 2 కప్పులు, కారం – ఒక టీస్పూన్, పచ్చిమిర్చి – 4, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, కరివేపాకు – 4 రెబ్బలు, శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర – అర టీస్పూన్, కొత్తిమీర తురుము – 3 టేబుల్ స్పూన్లు, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, పల్లీలు (ముక్కలుగా దంచినవి) – 2 టేబుల్ స్పూన్లు.
సర్వపిండిని తయారు చేసే విధానం..
పిండిలో అన్ని దినుసులు వేసి తగినన్ని నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. పెనం మీద నూనె రాసి పిండి ముద్దను దాని మీద వేళ్లతో కాస్త మందంగా చపాతీలా వత్తాలి. మధ్య మధ్యలో నాలుగైదు రంధ్రాలు పెట్టి రెండు వైపులా కాల్చి తీయాలి. ఇలాగే అన్నీ చేసుకోవాలి. దీంతో ఘుమఘుమలాడే సర్వపిండి రెడీ. వీటిని నేరుగా లేదా టమాటా చట్నీతో తింటే భలే రుచిగా ఉంటాయి.