Vankaya Jeedipappu Masala Curry : ఫంక్ష‌న్ల‌లో క్యాట‌రింగ్ వాళ్లు వ‌డ్డించే వంకాయ, జీడిప‌ప్పు కూర‌.. ఇలా చేయాలి..!

Vankaya Jeedipappu Masala Curry : ఫంక్ష‌న్స్ లో ఎక్కువ‌గా చేసే మ‌సాలా క‌ర్రీల‌లో వంకాయ జీడిప‌ప్పు మ‌సాలా కర్రీ కూడా ఒక‌టి. వంకాయ‌లు, జీడిప‌ప్పు క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, పులావ్, బ‌గారా, రోటీ, చ‌పాతీ ఇలా దేనితో తిన్నా కూడా ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న ఫంక్ష‌న్స్ ఉన్న‌ప్పుడు, స్పెష‌ల్ డేస్ లో వంకాయ‌ల‌తో ఇలా మ‌సాలా క‌ర్రీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ వంకాయ మ‌సాలా క‌ర్రీని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు ఎవ‌రైనా ఈ క‌ర్రీని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ వంకాయ‌ల జీడిప‌ప్పు మ‌సాలా కర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వంకాయ జీడిప‌ప్పు మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన వంకాయ‌లు – పావుకిలో, నూనె – 4 టేబుల్ స్పూన్స్, జీడిప‌ప్పు – గుప్పెడు, ల‌వంగాలు – 3, దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 2, బిర్యానీ ఆకు – 1, చిన్న‌గా తరిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు -ఒక రెమ్మ‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ట‌మాటాలు -2, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, ఉప్పు -త‌గినంత‌, జీల‌క‌ర్ర పొడి అర టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్, క‌సూరి మెంతి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా -ఒక టీ స్పూన్, నాన‌బెట్టిన క‌ర్బూజ గింజ‌లు – ఒక టేబుల్ స్పూన్, నాన‌బెట్టిన గ‌స‌గ‌సాలు – ఒక టీ స్పూన్, ఎండుకొబ్బ‌రి ముక్క‌లు -ఒక‌టిన్న‌ర టీ స్పూన్.

Vankaya Jeedipappu Masala Curry recipe in telugu very easy to prepare
Vankaya Jeedipappu Masala Curry

వంకాయ జీడిప‌ప్పు మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో క‌ర్బూజ గింజ‌లు, గ‌స‌గ‌సాలు, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీడిపప్పు వేసి దోర‌గా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత వంకాయ ముక్క‌లు వేసి వీటిని 4 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇదే నూనెలో మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగ‌గానే ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి.

వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌ల‌ను మెత్త‌గా మ‌గ్గించాలి. ట‌మాట ముక్క‌లు మ‌గ్గిన త‌రువాత ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి.త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు వేయించిన వంకాయ ముక్క‌లు, జీడిపప్పు, ఉప్పు, క‌సూరి మెంతి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌ర‌వుఆత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ జీడిప‌ప్పు మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. ఈ క‌ర్రీని రుచి చూసిన వారు మళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడ‌గ‌క మాన‌రు.

Share
D

Recent Posts