సీజన్ మారుతుందంటే చాలు శ్వాసకోస సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. జలుబు, గొంతునొప్పి అందులో ముఖ్యమైనవి. ఐతే ఈ కాలంలో గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుంటే దాన్నుండి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలని తెలుసుకుందాం. దీని కోసం మన కిచెన్ లో పదార్థాలే ఉపయోగపడతాయి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు తీసుకుని నీళ్లలో పోసి గోరు వెచ్చగా అయ్యేంత వరకూ స్టవ్ మీదే ఉంచాలి. ఆ తర్వాత ఆ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మివేయాలి. ఇలా ఒక నాలుగు సార్లు చేయాలి. కొద్దిపాటి ఉసిరికాయ రసాన్ని తీసుకుని దానికి తేనె కలిపి రెండుసార్లు తాగాలి.
ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుని, 250 మిల్లీ లీటర్ల నీళ్ళలో ఉడికించాలి. ఆ తర్వాత వడకట్టి ఆ నీటిని తాగాలి. ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ గానీ లేక దాల్చిన చెక్క తీసుకుని 250 మిల్లీ లీటర్ల నీటిలో ఐదు నిమిషాల పాటు మరిగించాలి. గోరు వెచ్చగా కాగానే దానికి కొంచెం తేనె, నిమ్మరసం కలుపుకుని తాగాలి. నాలుగు లేదా ఐదు ఆకుల తులసి తీసుకుని నీళ్ళలో వేడి చేయాలి. ఆ తర్వాత దానికి తేనె లేదా అల్లం రసం కలుపుకుని తాగవచ్చు.
గోరువెచ్చని పాలల్లో పసుపు కలుపుకుని రాత్రిపూట తాగి పడుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది. దానికి నల్ల మిరియాలు కలుపుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళు తీసుకుని దానికి నిమ్మరసంతోపాటు తేనె కలుపుకుంటే గొంతునొప్పి త్వరగా తగ్గిపోతుంది.