అసలు సత్యం సంస్థలో జరిగిన సంఘటన చూద్దాం. 1987 లో రామలింగరాజు చేత స్థాపించబడి నాలుగు సంవత్సరాలలోనే మన భారత స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి సంచలనం సృష్టించింది. 1988 లో దీనితో పాటుగా మైటాస్ ఇంఫ్రా, ప్రాపర్టీస్ అనే ఇంకో రెండు సంస్థలను కూడా స్థాపించారు. వీటిలో అధికభాగం భాగస్వాములు అయన స్నేహితులు, బంధువులే. సత్యం కంప్యూటర్స్ అద్భుతంగా నడుస్తున్నప్పుడు రామలింగరాజు దృష్టి రియల్ ఎస్టేట్ వైపు మళ్లింది. హైదరాబాదు లో మంచి అభివృద్ధి జరుగుతున్న సమయంలో, ఆ ప్రాంతాలలో స్థిరాస్తులను కొనడానికి, సత్యం కంప్యూటర్స్లో వచ్చిన లాభాలను ఎక్కువగా చూపించి ఆ షేర్ యొక్క ధర విపరీతంగా పెరిగేటట్టు చేసి, తరువాత తమ దగ్గర ఉన్న షేర్లలో కొంత భాగాన్ని అమ్మేసి ఆ డబ్బుని స్థిరాస్థులలో పెట్టుబడిగా పెట్టేవారు.
అయితే తెలివిగా ఈ లావాదేవీలన్నీ తన ఇంకో రెండు సంస్థల ద్వారా, మరియు చాలా నకిలీ సంస్థల ద్వారా జరిగేటట్టు చూసేవారు. వీటికి డైరెక్టర్లగా స్నేహితులని, తనకు తెలిసినవాళ్లందరిని పెట్టేవాడు. ఐతే ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా కొనడానికి గల కారణం మెట్రో మ్యాప్ యొక్క సమాచారం తన వర్గాల ద్వారా ముందస్తుగా తెలియడమే. ఇలా కొన్ని సంవత్సరాలుగా చెయ్యడం వల్ల, సత్యం కంప్యూటర్స్ యొక్క నిజమైన లాభాలకి, కల్పిత లాభాలకి దూరం బాగా పెరిగింది. ఎదో ఒకలాగా ఈ దూరాన్ని ధరలు బాగా పెరిగిన తరువాత స్థలాలని అమ్మేసి తగ్గిదాం అనుకున్న రాజుకి ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ కుదేలవడంతో ఎదురు దెబ్బ తగిలింది. అయినా పట్టువదలక, తెలివిగా సత్యం కంప్యూటర్స్ మిగిలిన రెండు సంస్థలైన మైటాస్ ఇంఫ్రా, ప్రాపర్టీస్ లో అధికభాగం లేదా పూర్తిగా వాటాని కొనుగోలు చెయ్యాలని ప్రతిపాదన తెచ్చాడు. ఎవరైనా సత్యం లాభాలు ఏమయ్యాయి అని ప్రశ్నించే లోపు, వాటిని ఈ సంస్థలను కొనుగోలు చెయ్యడానికి ఉపయోగించేశాం అని చెప్పొచ్చనుకున్నాడు. బోర్డు అఫ్ డైరెక్టర్స్ ఆమోదం తెలిపేటట్టు చేసి, ఈ ప్రక్రియ పూర్తిచేసాడు.
పెట్టుబడిదారులు, వాటాదారుల ఆమోదం లేకుండా జరిగిన ఈ లావాదేవీ అసలు నచ్చకపోవడం వల్ల వాళ్ళని చికాకులో పెట్టింది. దీనితో పెద్ద వాటాదారులైన ఇన్సూరెన్సు సంస్థలు, బ్యాంకులు, ఇతర మ్యుట్యుయల్ ఫండ్స్ మెల్లగా తప్పుకోవడం ప్రారంభించారు. అంతే షేర్ ధర పతనం మొదలయ్యింది, సగానికి సగం. తప్పని పరిస్థితిలో తన ప్రతిపాదనని వెనక్కి తీసేసుకున్నాడు. బోర్డు అఫ్ డైరెక్టర్స్ మెల్లిగా తప్పుకోవడం మొదలు పెట్టారు ప్రమాదం గ్రహించి. ప్రశ్నలు ఎక్కువ అవ్వడంతో చివరికి తాను చూపిన తప్పుడు లెక్కలు గురించి ఒప్పుకున్నాడు. వాటిని చూసి నిపుణులు నివ్వెరపోయారు. కొన్ని సంవత్సరాలు పదిరెట్లు కంటే ఎక్కువ లాభం చూపించి ఎలా తప్పించుకున్నారా అని చూస్తే ఆడిట్ సంస్థల్ని కూడా బోల్తా కొట్టించేసారు. పీడబ్ల్యూసీ , సత్యం కంప్యూటర్స్ కి ఆడిటర్లు గా పనిచేసే సంస్థకు భారీగా జరిమానా పడింది, అంతే కాక తాత్కాలిక నిషేధం కూడా అమలు అయ్యింది. తరువాత రాజుని అరెస్ట్ చేసిని విషయం తెలిసిందే. కాబట్టి స్వయంకృతాపరాధం వల్లనే జరిగింది గానీ, ఒకరి వల్ల కాదు. నిజాయితి లేకపోవడం, అత్యాశకు గురవ్వడం ఎవరినైనా పతనం చేస్తాయనడానికి ఇదొక ఋజువు.