మనం తినే ఆహారం గ్లూకోజ్ గా విడగొట్టబడుతుంది. ఇది రక్తంలో షుగర్ గా చెప్పబడుతుంది. శరీరానికి ఇదే ప్రధాన ఇంధనం. పొట్ట వెనుక పాంక్రియాస్ అనే ఒక పెద్ద గ్రంధి వుంటుంది. అది ఇన్సులిన్ తయారు చేస్తుంది.శరీరానికి అవసరమైన పరిమాణంలో ఈ గ్రంధి ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతే, లేదా శరీర కండరాలు, లివర్ టిష్యూలు మొదలైనవి ఇన్సులిన్ సరిగా ఉపయోగించకపోతే, గ్లూకోజ్ రక్తంలోనే వుండిపోతుంది. శరీరం గ్లూకోజ్ కావాలని కోరుతూంటుంది. దీనినే డయాబెటీస్ అంటారు.
దీని కారణంగడా శరీర నరాల వ్యవస్ధ, కళ్లు, కిడ్నీలు, గుండెకు రక్తం చేరవేసే రక్తనాళాలు దెబ్బతింటాయి. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధులు లేదా గుండె పోటు వస్తాయి. డయాబెటీస్ వున్నవారికి చిన్న వయసులోనే గుండెజబ్బులు వస్తాయి. అవి 30 సంవత్సరాల వయసు వచ్చే సరికి ముదిరి మరింత తీవ్ర సమస్యలకు గురిచేస్తాయి.
అయితే మహిళలలో మెనోపాజ్ దశకు రాని వారికి డయాబెటీస్ వున్నప్పటికి గుండె జబ్బుల తీవ్రత తక్కువగా వుంటుంది. డయాబెటీస్ రోగులకు గుండెజబ్బు రావటంలో కారణమేమిటి? డయాబెటీస్ రోగుల రక్తనాళాలు గట్టిపడతాయి. నాళాలలో గడ్డలు ఏర్పడతాయి. వీరి రక్తంలోని కొన్ని పదార్ధాలు విభిన్నంగా వుండి ఎల్లపుడూ గడ్డ కట్టేందుకు రెడీగా వుంటుంది. గుండెకు రక్తం చేరవేసే రక్తనాళాలలో గడ్డలు ఏర్పడితే, గుండెకు రక్తం అందక గుండెపోటు వచ్చే అవకాశం వుంది.