డైటింగ్ చేసేవారు చాలామంది కొద్ది వారాలపాటు జ్యూస్ తీసుకుంటూ తమ అధిక బరువు తగ్గించుకుంటారు. పోషకాహార నిపుణుల మేరకు ప్రధాన పోషకాలు కల పండ్ల రసాలు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యమే. మరి సమర్ధవంతంగా బరువు తగ్గాలంటే సరైన రీతిలో పండ్లరసాలు ఎలా తాగాలో చూడండి. పండ్ల రసాల వలన ప్రయోజనాలు అనేకం. సాధారణంగా సెలిబ్రిటీలు, మోడల్స్, సైజ్ జీరో అవ్వాలనుకునేవారంతా పండ్లు, కూరల రసాలు ఆహారం బదులుగా 4 లేదా 5 వారాలపాటు తాగి బరువు తగ్గించేసుకుంటారు. కొంతమందికి 4 మరికొంతమంది 5 లేదా 6 కిలోల బరువు కూడా తగ్గిపోతూంటుంది.
మీరు తీసుకునే పండ్ల రసాలు మీ పోషకాహార నిపుణుడి సలహాపై వుండాలి. రసాల ఆహారం మీ జీర్ణ వ్యవస్ధను శుభ్రపరుస్తుంది. మలినాలు వెలికి తీస్తుంది. చర్మం మెరిసేలా, తల వెంట్రుకలు బలపడేలా చేస్తుంది. రసాల ఆహారం కండ్లకు కూడా మేలు చేస్తుంది. చూపు మెరుగవటం, గోళ్ళు గట్టిపడటం, శరీరం దుర్గంధం లేకుండా చేయటం, శరీరంలో ఎపుడూ తేమ వుండేలా చేయటం చేసి చర్మాన్ని సంరక్షిస్తుంది. రసాల ఆహారంపై వుంటే మీరు ఉపవాసం చేసినట్లే లెక్క. కాని అపుడపుడూ కోసిన పండ్లు కూడా తీసుకోవటం మంచిది. రసాల ఆహారంపై వుండే వారు, ఎపుడు తీసుకున్నా తాజా పండ్ల రసం లేదా కూరల రసం తీసుకోవాలి. ప్యాకేజీ పండ్ల రసాలలో కృత్రిమ రంగులు, వాసనలు వుంటాయి. ఇవి మీ బరువును పెంచటమే కాక బ్లడ్ షుగర్ స్ధాయి పెంచుతాయి.కనుక ఆరోగ్యంగా వుండాలంటే సహజ పండ్ల రసాలే తీసుకోండి.
నిమ్మజాతి పండ్లు రసాలు కొవ్వును తేలికగా కరిగిస్తాయి. నిమ్మ, ఆరెంజ్, ద్రాక్ష, బెర్రీ మొదలైన పండ్లు రసంగా తాగవచ్చు. వెజిటబుల్ జ్యూస్ లో మంచి పోషకాలుంటాయి. కడుపు నింపుతుంది. బరువు తగ్గటమే కాదు. చర్మకాంతి పెరుగుతుంది. కాకర, కేరట్, గుమ్మడి, మొదలైన కూరల రసాలు తాగవచ్చు. అప్పటికపుడు కోసిన పండ్లు లేదా ఉడికించిన కూరలు కూడా మీ రసాల ఆహార ప్రణాళికలో లేనప్పటికి తీసుకోవచ్చు. ఇది మీ శరీరం బలహీనపడకుండా చేస్తుంది. ఆకలి వేయకుండా కడుపు నింపుతుంది. కొంతమంది పెరుగు తినటానికి కూడా ఇష్టపడతారు. ఇవన్నీ రసాల ఆహారం తినటం వలన వచ్చే ప్రయోజనాలు.