ఎన్నో సంవత్సరాల కింది నుంచే అనేక మంది శాస్త్రవేత్తలు అసలు ఈ సృష్టి క్రమం ఎలా ప్రారంభమైందనే దానిపై అనేక పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా దాదాపుగా ఏ సైంటిస్టూ కనిపెట్టలేకపోయాడు. అయినా వారు తమ తమ పరిశోధనలను మాత్రం ఆపడం లేదు. ఎప్పటికైనా సృష్టి క్రమానికి చెందిన రహస్యాన్ని కనిపెట్టాలని వారు తపన పడుతున్నారు. అయితే దీని విషయం అలా ఉంచితే, హిందూ పురాణాల్లో మాత్రం సృష్టి క్రమానికి చెందిన పలు అంశాలను ఎంతో మంది పండితులు, రుషులు పేర్కొన్నారు. ఆయా పురాణాల్లో సదరు అంశాలకు చెందిన ప్రస్తావనలు కూడా ఉన్నాయి. ప్రధానంగా బ్రహ్మ పురాణం, గరుడ పురాణం వంటి పురాణాల్లో సృష్టి క్రమానికి చెందిన పలు విషయాలు మనకు తెలుస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనకు 60 సెకండ్లు 1 నిమిషం. 60 నిమిషాలు 1 గంట. 24 గంటలు ఒక రోజు. కానీ బ్రహ్మ దేవుడికి ఒక రోజు మాత్రం అలా ఉండదు. 1000 మహాయుగాలు గడిస్తే అప్పుడు బ్రహ్మకు ఒక రోజు పూర్తయినట్టు లెక్క. మహాయుగం అంటే సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం… ఇలా 4 యుగాలు కలిస్తే అప్పుడు ఒక మహాయుగం అవుతుంది. ఈ ఒక్క మహాయుగం పూర్తవ్వాలంటే మన కాలమానం ప్రకారం 43.20 లక్షల సంవత్సరాలు గడవాల్సి ఉంటుంది. అప్పుడు ఒక మహాయుగం పూర్తవుతుంది. అలాంటి మహాయుగాలు 1000 గడిస్తే అప్పుడు బ్రహ్మకు ఒక రోజు గడిచినట్టు అవుతుంది. ఇలా బ్రహ్మకు ఒక రోజు గడవగానే విశ్వమంతటికీ మహా ప్రళయం వస్తుంది.
మహా ప్రళయం వచ్చినప్పుడు బ్రహ్మ నిద్రలోకి వెళ్తాడట. ఈ క్రమంలో విశ్వమంతా నీటిమయం అవుతుందట. చుట్టూ కనుచూపు మేరలో ఎక్కడ చూసినా నీరే ఉంటుందట. సూర్యుడు, చంద్రుడు, అన్ని గ్రహాలు, నక్షత్రాలు బద్దలైపోయి ఆ నీటిలో కలిసిపోతాయట. అలా జరిగాక బ్రహ్మ మళ్లీ మేల్కొని కొత్త సృష్టిని చేయడం ప్రారంభిస్తాడట. ఆ క్రమంలో ముందుగా ఏక కణ జీవులు పుట్టుకువచ్చి, అనంతరం మళ్లీ జీవ పరిణామ క్రమం మొదలవుతుందట. అయితే విశ్వమంతా నిండిపోయిన నీటిని మధించడం కోసం బ్రహ్మ ఏకంగా విశ్వమంత ఎత్తుకు పెరిగి నేలను పైకి తీసుకువస్తాడట. దీంతో సృష్టి మళ్లీ ప్రారంభమవుతుందట. దీని గురించే పురాణాల్లో రాశారు. ఏది ఏమైనా, సృష్టి క్రమం కచ్చితంగా ఎలా ప్రారంభమైందో చెప్పడం మాత్రం కష్టమే. ఇంతకీ దీనిపై మీ అభిప్రాయమేమిటి..?