మారిన జీవిన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల హృద్రోగాల బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చిన్న వయసులో ఉన్న వారికి కూడా గుండెపోటు రావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఒకసారి గుండెపోటు వచ్చిన తర్వాత కోలుకుంటున్న వారు జీవితాంతం జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి గుండెపోటు వస్తే.. మళ్లీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అందుకే గుండె వ్యాధుల నుంచి కోలుకున్న తర్వాత కూడా కచ్చితంగా జీవన విధానంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా మెడిసిన్స్ వాడడం ఎంత ముఖ్యమో తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని చెబుతున్నారు. ఇంతకీ గుండెపోటు నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
గుండెపోటు నుంచి కోలుకున్న తర్వాత ఆహారంలో తృణధాన్యాలను భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలోని డైటరీ ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి, బరువు అదుపులో ఉంచడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఓట్స్, బార్లీ, బ్రౌన్ రైస్ వంటి వాటిని తీసుకోవాలి. అలాగే తాజా పండ్లు, కూరగాయలను క్రమంతప్పకుండా తీసుకోవాలి. ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అయితే పండ్ల రసం తాగే బదులు తినడం మంచిది. అలాగే కూరగాయలు వండే సమయంలో తక్కువ నూనె ఉపయోగించాలి. రోజూ కొన్ని బాదంపప్పులను తీసుకోవడం అలవాటుగా మార్చుకోవాలి. చికెన్, మటన్ తగ్గించి చేపలు తీసుకోవడం బెటర్. గుండెపోటు నుంచి కోలుకున్న తర్వాత ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎక్కువ చక్కెర పదార్థాలుండే చాక్లెట్, ఐస్ క్రీం, కస్టర్డ్ వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. చిప్స్, కుకీలు వంటి వాటి జోలికి వెళ్లకూడదు. అలాగే తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. పిజ్జా, బర్గర్, హాట్ డాగ్ వంటి జంక్ ఫుడ్ అస్సలు ముట్టుకోవద్దు.
గుండెపోటు నుంచి కోలుకున్న తర్వాత తీసుకునే ఆహారంతో పాటు జీవన విధానంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విధిగా మెడిసిన్స్ వాడడంతో పాటు నిత్యం బీపీ చెక్ చేసుకోవాలి. కచ్చితంగా ప్రతీ రోజూ 45 నిమిషాలపాటు వాకింగ్ చేయడం అలవాటుగా మార్చుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. ఆల్కహాల్, స్మోకింగ్ అలవాటు ఉంటే పూర్తిగా మానేయ్యాలి.