ఏడు కొండల పై వెలిసిన శ్రీ వేంకటేశ్వరుని దేవాలయం విశ్వ విఖ్యాత మైంది. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లాలో తిరుపతి పట్టణంలో కలదు. ఈ దేవాలయాన్ని ప్రతి ఏటా లక్షలాది యాత్రికులు దర్సిన్చుకుంటారు. భగవంతుడు శ్రీనివాసుడికి తమ ముడుపులు, కానుకలు సమర్పించి స్వామీ ఆశీస్సులు పొందుతారు. తిరుపతి ఏడు కొండలపై నివాసుడైనా విశ్వమందున్న అనేక భక్తులకు కల్పతరువుగా, వరాల వేల్పుగా అందరికి తెలుసు. తల నీలాలనుండి, క్యూలో దర్శనం దాకా ప్రతివారి జీవితంలోనే మరపురాని దృశ్యాలుగా మనసులో చెదరని ముద్రవేస్తాయి. తిరుపతి లడ్డు అన్నపేరు వినగానే ఆ మధురమైన రుచి మనకి జ్ఞాపకం వస్తుంది. తిరుపతి చేరగానే లక్షలాది భక్తుల గోవిందా! గోవిందా! అన్న భక్తి చైతన్యపు పిలుపులు మనకి వినిపిస్తుంటాయి. ఆ మంత్రం అప్రయత్నంగా మన నోట కూడా పలకడం ప్రారంభిస్తుంది.
తిరుపతి వెళ్ళడం భక్తిలోనే కాదు, సన్స్కృతిలో కూడా భాగం అనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వరుని లీలా విశేషాలు, భక్తులు అద్భుత అనుభవాలు చెప్పాలంటే ఎన్ని గ్రంధాలైనా చాలవు కదా! తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని మూలవిరాట్టు గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు. దీనివెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో మీకు తెలుసా?? అయితే ఈ కథనం చదవండి.. శ్రీవారి కైంకర్యంలో తరించిన భక్తాగ్రేశ్వరుడు శ్రీ అనంతాళ్వార్. శ్రీ అనంతాళ్వార్ తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయానికి వెనక వైపు నివసించారు. ఈయన స్వామి వారికి రోజూ పూలమాలాలు సమర్పించేవారు. అనంతాళ్వారు తిరుమల వెంకటేశ్వరస్వామి భక్తులలో అగ్రగణ్యుడు. భగవద్రామానుజుల ఆజ్జమేరకు స్వామికి పుష్పమాల కైంకర్యం చేయడానికి తన జీవితాన్నే అంకితం చేశాడు. స్వామికి పూలమాలను అల్లటానికి ఆయన ఒక పూలతోటను పెంచదలచినాడు.
అయితే ఆ పూతోట పెంపకానికి సరిపడా నీరు అందించడానికి ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయించుకొని, చెరువు తవ్వడం మొదలు పెడుతాడు. ఇతరుల సహాయం తీసుకోకుండా, తాను, తన ధర్మపత్ని మాత్రమే ఆ చెరువును తవ్వాలని సంకల్పం చేసుకొని కార్యం ఆరంభిస్తాడు. అనంతాళ్వారు గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే అతని భార్య గంపలలో ఎత్తుకొని వెళ్లి దూరంగా ఆ మట్టిని పోసేది. ఆ సమయంలో ఆమె నిండు చూలాలు. ఆమె పరిస్థితిని చూపిన శ్రీ వెంకటేశ్వరుడు వారివురికి సహాయపడటానికి ఒక పన్నెండేళ్ల బాలుని రూపంలో అక్కడికి వస్తాడు. ఆ గర్భిణికి సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని పారబోయేటంలో సహాయపడతాడు. ఈ విషయం తెలుసుకున్న అనంతాళ్వారు కోపంతో ఆ బాలుడిపైకి గునపాన్ని విసురుతాడు. ఆ గునపం బాలుని గడ్డానికి తగిలి రక్తం స్రవిస్తుంది. అంతలోనే ఆ బాలుడు ఆనంద నిలయంలోకి వెళ్లి కనబడకుండా దాక్కుంటాడు.
శ్రీవారి ఆలయంలో అర్చకులు స్వామి వారి విగ్రహంలో గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆ విషయాన్ని అనంతాళ్వారుకు తెలియజేస్తారు. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఆలయానికి చేరుకున్న అనంతాచార్యులు, గర్భాలయంలోని మూలమూర్తి గడ్డం నుంచి రక్తం వస్తూ వుండటం చూసి ఆశ్చర్యపోతాడు. తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు, సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరుడని గ్రహించి కన్నీళ్లతో స్వామి పాదాలపై పడతాడు. తనని మన్నించమని కోరుతూనే, గాయం వలన స్వామికి కలుగుతోన్న బాధ ఉపశమించడం కోసం అక్కడ పచ్చకర్పూరం అద్దుతాడు. అలా ఆయన ప్రతి రోజూ చల్లదనం కోసం గాయమైన చోట గడ్డానికి చందనం రాసి ఆ తరువాత పచ్చకర్పూరం పెట్టేవాడు. అలా స్వామివారి మూలమూర్తికి గడ్డం కింద పచ్చకర్పూరం పెట్టడం ఒక ఆచారంగా మారిపోయింది. అప్పటినుంచి స్వామివారి గడ్డం పై రోజూ పచ్చకర్పూరం అద్దుతారు.
ఇప్పటికీ మనం అనంతాళ్వారులు స్వామివారి మీద విసిరిన గునపాన్ని మహద్వారం దాటిన తర్వాత కుడి వైపు గోడకు వెళ్ళాడుతూ ఉండటం చూడవచ్చు. శ్రీ అనంతాళ్వార్ బృందావనం శ్రీవారి ఆలయం వెనకవైపు ఉంటుంది. మనం అనంతాళ్వార్ బృందావనం దర్శించవచ్చు. శ్రీవారి ఉత్సవ మూర్తి అయిన మలయప్పస్వామి సంవత్సరానికి ఒకసారి శ్రీ అనంతాళ్వార్ బృందావనం కి వెళ్తారు.