తల్లి పాలు బిడ్డకు చాలా మేలు చేస్తుంది. తల్లి పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది బలవర్థకమైన ఆహారం. మెదడు, రోగనిరోధక శక్తి, జీర్ణ వ్యవస్థల పెరుగుదలలో తల్లి పాలు ఎంతోగానో సహకరిస్తుంది. పిల్లలకు తొలి పోషణ, రక్షణ ఇచ్చేది తల్లి పాలే. బిడ్డ సంపూర్ణ ఆరోగ్యం కోసం తల్లి పాలు ఇవ్వడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వ్యాధుల్ని సమర్థవంతంగా ఎదుర్కొనే యాంటీ బాడీలు, పోషకాలు తల్లిపాలలో ఉంటాయి. పాలివ్వడం బిడ్డ ఆరోగ్యానికి మాత్రమే కాదు.. తల్లికి కూడా ఎంతో మంచిది అంటున్నారు వైద్యులు. కొంత మంది తల్లుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, బరువు కారణంగా పాల ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో బిడ్డకు పాలు ఇవ్వలేరు. అందుకే పాలిచ్చే అమ్మలు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తల్లి తీసుకునే ఆహారం.. పిల్లల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.
తల్లీ, బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉండాలంటే సరైన డైట్ తప్పనిసరి. అయితే, కొన్ని ఫుడ్స్కి మాత్రం పాలిచ్చే తల్లులు దూరంగా ఉండాలి. ఆ ఫుడ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. పాలిచ్చే తల్లులు మసాలా, స్పైసీ, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి బిడ్డ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. వీటి వల్ల పిల్లలకు కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు, వాంతులు వచ్చే ప్రమాదముంది. అందుకే.. మసాల ఫుడ్స్ ఎక్కువ తినకపోవడమే ఉత్తమం. పాలిచ్చే అమ్మలు వెల్లుల్లి ఎక్కువగా తినకూడదు. తల్లి తీసుకునే ఆహారంలో వెల్లుల్లి ఎక్కువైతే.. పాలు ఆ వాసన వస్తాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే మూలకం ఉంటుంది. దీని వాసన పిల్లల్ని ఇబ్బందిపెడుతుంది. తల్లులు వెల్లుల్లి ఎక్కువ తీసుకోవడం వల్ల పాలు వాసన వస్తాయి. దీంతో.. పిల్లలు ఆ పాలు తాగడానికి ఇష్టపడరు.
టీ, కాఫీల్ని పాలిచ్చే తల్లులు మితంగా తీసుకుంటేనే బిడ్డ ఆరోగ్యానికి మంచిది. అధిక మొత్తంలో కాఫీ, టీ తీసుకుంటే పిల్లల నిద్రపై ప్రభావం చూపుతుంది. పిల్లలు నిద్రలేమి సమస్యతో బాధపడే అవకాశం ఉంది. కాఫీలో ఉండే కెఫీన్ను పిల్లలు జీర్ణించుకోలరు. దీంతో పిల్లలు రాత్రి సరిగ్గా నిద్రపోరు. అందుకే బాలింతలు కెఫీన్ ఉండే ఫుడ్స్కు దూరంగా ఉండాలి. పాలిచ్చే తల్లుల్లు కొన్ని రకాల కూరగాయలకు దూరంగా ఉండాలి. క్యాలీఫ్లవర్, బ్రకోలి, ముల్లంగి వంటి వాటిని ఎక్కువ తినకూడదు. వీటిని ఎక్కువగా తింటే బిడ్డకు కడుపు నొప్పి వచ్చే ప్రమాదముంది. అంతేకాకుండా డార్క్ చాక్లెట్ కూడా తినకూడదు. అంతేకాకుండా కొన్ని రకాల చేపలకు కూడా దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
పాలిచ్చే తల్లులు సిట్రస్ ఫ్రూట్స్ తినకూడదని పెద్దలు చెబుతుంటారు. తింటే పిల్లలకు జలుబు, దగ్గు వస్తుందని చెబుతుంటారు. అయితే, ఇది కేవలం అపోహ మాత్రమే అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. సిట్రస్ ఫ్రూట్స్లో విటమిస్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పాలు పడాలంటే తల్లులు మంచి ఆహారాన్ని తమ డైలీ డైట్లో భాగం చేసుకోవాలి. ఆకుకూరలు తినడం మంచిది. వీటిలో ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మీరు పాలిచ్చే సామర్థ్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా అవకాడో, అలివ్ ఆయిల్, నెయ్యి, సాల్మన్ ఫిష్, నట్స్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి పాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి.