Coriander Water : ధనియాలు… మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో ఇవి కూడా ఒకటి. ధనియాలు చక్కటి వాసనను కలిగి ఉంటాయి. వీటిని పొడిగా చేసి మనం వంటలల్లో వాడుతూ ఉంటాము. ధనియాలు వేయడం వల్ల వంటలు చక్కటి రుచిని, వాసనను కలిగి ఉంటాయి. అలాగే ధనియాలు అనేక రకాల పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వీటిని వాడడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. అయితే ధనియాలను వంటల్లో వాడడానికి బదులుగా వీటితో నీటిని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాస్ నీటిలో ధనియాలు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని మరిగించి వడకట్టి తాగాలి. ఇలా తాగడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
రోజూ ఉదయం పరగడుపున ధనియాల నీటిని తాగడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ ఉదయం ధనియాల నీటిని తాగడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. థైరాయిడ్ గ్రంథి అసమతుల్యత వంటి సమస్యలతో బాధపడే వారు ఈ నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ నీటిని తాగడం వల్ల ఐరన్, పొటాషియం, విటమిన్ ఎ, సి, కె వంటి పోషకాలు లభిస్తాయి. రోజూ ఉదయం పరగడుపున ధనియాల నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ధనియాల్లో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
![Coriander Water : ధనియాల నీళ్లను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగండి.. ఈ ప్రయోజనాలు కలుగుతాయి..! Coriander Water take daily on empty stomach](https://i0.wp.com/ayurvedam365.com/wp-content/uploads/2024/02/coriander-water.jpg?resize=1200%2C675&ssl=1)
ధనియాల నీటిని తాగడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి మనల్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడడంలో సహాయపడతాయి. అదే విధంగా ధనియాల నీటిని తాగడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. మనం సులభంగా బరువు తగ్గవచ్చు. ఇక స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో కూడా ధనియాలు మనకు సహాయపడతాయి. ధనియాల నీటిని తాగడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పి, తిమ్మిర్లు తగ్గుతాయి. అంతేకాకుండా ఈ నీటిని తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా దరి చేరకుండా ఉంటాయి. ఒత్తిడిని నివారించడంలో కూడా ధనియాల నీరు మనకు సహాయపడుతుంది. ఈ విధంగా ధనియాల నీటిని తయారు చేసి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.