డ్రింక్స్‌

జలుబు వేగంగా తగ్గాలంటే.. తులసి కషాయం తాగాల్సిందే..!

సాధారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నప్పుడు ఎన్నో రకాల బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ లకు గురవుతారు. ఈ క్రమంలోనే వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం వల్ల చాలామంది జలుబు సమస్యతో బాధపడుతుంటారు. ఈ విధంగా వాతావరణ పరిస్థితులలో మార్పులకు అనుగుణంగా దగ్గు, జలుబు రావడం సర్వసాధారణమే. అయితే దగ్గు, జలుబు మరింత ప్రమాదకరం ఏమీ కాదు కనుక మన ఇంట్లోనే కొన్ని నివారణ పద్ధతులను ఉపయోగించి ఈ జలుబు సమస్యనుంచి ఉపశమనం పొందవచ్చు.

దగ్గు, జలుబును దూరం చేసే ఎన్నో నివారణ మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో తులసి కషాయం బాగా పనిచేస్తుంది. తులసి ఆకులు మన ఇంటి ఆవరణంలో నిత్యం లభించేవే. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయనే విషయం మనందరికీ తెలిసిందే. అందుకోసమే ఈ తులసి ఆకులను జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యల నుంచి విముక్తి పొందడం కోసం ఎంతో విరివిగా ఉపయోగిస్తారు. అయితే తులసి ఆకులను పచ్చిగా తినడం కంటే వీటిని కషాయంగా తయారు చేసుకొని తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. మరి తులసి కషాయం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందామ..!

కావలసిన పదార్థాలు

  • ఒక కప్పు ఉడకబెట్టిన కందిపప్పు నీరు
  • అర స్పూన్ జీలకర్ర
  • అర స్పూన్ నల్ల మిరియాలు
  • గుప్పెడు తులసి ఆకులు
  • టేబుల్ స్పూన్ నెయ్యి
  • టేబుల్ స్పూన్ తేనె

తయారీ విధానం

* ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకుని జీలకర్ర, నల్ల మిరియాలను దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న వీటిని పొడి చేసి పెట్టుకోవాలి.

* తరువాత మరొక గిన్నెలో ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు నీటిని వేసి బాగా మరిగించాలి. ఈ నీరు కొద్దిగా దగ్గర పడగానే అందులోకి పొడి చేసి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర పొడి వేసి ఉడికించాలి.

* తరువాత ఈ నీటిలో గుప్పెడు తాజా తులసి ఆకులను వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా తయారైన తులసి కషాయంలో కొద్దిగా తేనె కలుపుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు తాగవచ్చు.

ఈ విధంగా తులసి కషాయం తాగడం వల్ల అందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన శరీరంలో గాయాలను మాన్పించటానికి దోహదపడతాయి. అదేవిధంగా తులసి ఆకులలో ఎక్కువగా విటమిన్ ఎ, ఐరన్, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లను తగ్గించడమే కాకుండా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి దోహద పడతాయి. ఇలా తులసి కషాయాన్ని పరగడుపునే తాగటం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Sailaja N

Recent Posts