పిల్లల్లో చెవినొప్పి తరచుగా వస్తున్నట్లయితే అందుకు ప్రధాన కారణం చెవిలోపల శుభ్రం చేయకపోవడమే కావచ్చు. గులిమి గట్టిపడి శుభ్రం చేయడానికి సాధ్యం కాకుంటే వేడినీటిలో ఉప్పు కరిగించి డ్రాపర్తో చెవిలో నాలుగు చుక్కలు వేసి అప్పుడు దూదితో శుభ్రం చేయాలి. పులిహొర తింటే కడుపు బరువుగా ఉన్నట్లు ఉంటుంది. ఆ బరువు తగ్గాలంటే ఒక చిట్కా ఉంది పులిహొర తిన్న వెంటనే గోరు వెచ్చని నీరు ఒక గ్లాసుడు తాగేస్తే తొందరగా జీర్ణం అవుతుంది. వేడి కూడా చేయదు. పిండి పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలి. బాగా ఉడికిన అన్నం, పప్పు అన్నిటికంటే మంచిది. పుదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారంలో ఫ్యాట్ ఎక్కువుగా ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో పుదీనా తీసుకుంటే అజీర్తి సమస్య ఉండదు.
పుదీనా రసం ఎండ తాపాన్ని తగ్గిస్తుంది. ఎండకాలంలో రోజుకో గ్లాసు పుదీనారసం తాగితే శరీర ఉష్ణోగ్రత వాతావరణానికి అనుకూలంగా సమన్వయమవుతుంది. ఎండలు పెరుగుతున్నాయి కాబట్టి ఈ రోజుల్లో పిల్లలకు పుదీనా రసాన్ని ఇస్తుంటే వడదెబ్బ తగలదు. పైత్యం, ఆ కారణంగా తలతిప్పటం వంటి సమస్యలున్నప్పుడు జీలకర్రను మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ను నీటిలో కలిపి తాగాలి. ఇలా రెండు రోజుల పాటు రోజుకు రెండుసార్లు చేయాలి. పొట్టకి సంబంధించిన పలు సమస్యలకు వెల్లుల్లి మంచి మందు, ఒకటి రెండు రెబ్బల వెల్లుల్లిని మెత్తగా నూరి ఆ రసాన్ని అరకప్పు నీటిలో కలిపి తాగాలి. దీని వల్ల అరుగుదల, పొట్టలో పురుగులు నశించటం, శరీరంలోని విష పదార్ధాలు నశించటం, కొలెస్ట్రాల్ నియంత్రణ, తక్కువ స్థాయిలో ఉన్న విరేచనాలు తగ్గుతాయి.
పొద్దున లేవగానే ఖాళీ కడుపుతో యాపిల్ పండు తింటే తలనొప్పి సమస్య తొందరగా తలెత్తదు. ప్రతీరోజూ రెండుసార్లు తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలి. ఏదైనా తిన్న ప్రతీసారీ ఆహారం తాలుకా అవశేషాలు నోట్లో మిగలకుండా మంచి నీటితో పుక్కిలించాలి. ప్రతీరోజు ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఒక్కొక్కటి నాలుగైదు చొప్పున తులసి, వేపఆకులను, ఐదారు మిరియాలను వేసి మరిగించి తాగాలి. (హై బిపితో బాధపడుతున్న వాళ్లు మినహాయించాలి).