ఇళ్ళలోనూ, పని స్థలంలోనూ పని భారంతో సతమతమయ్యే మహిళలకు వచ్చే ప్రధానంగా వచ్చే జుట్టు సమస్యల్లో చుండ్రు ఒకటి. చుండ్రు ఎక్కువైన వారికి తల పై భాగంలోని పొర పొలుసులు పొలుసులుగా వచ్చి బయటికి తెల్లగా అసహ్యంగా కనబడుతుంటుంది. చుండ్రు బాధ ఎక్కువగా ఉన్నవారు కొబ్బరినూనెలో నిమ్మరసం పిండి గోరువెచ్చగా చేసి తలకు బాగా పట్టించాలి. నూనె పట్టించేటప్పుడు మాడుకు బాగా అంటేలా జాగ్రత్తపడాలి. అరగంటపాటు అలాగే ఉంచి ఆరిన తరువాత తలస్నానం చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఇలా వారానికి రెండు మూడుసార్లు చేస్తే చాలావరకు చుండ్రు సమస్య తగ్గుతుంది.
అంతేగాకుండా రాత్రిపూట గోరువెచ్చటి నూనెతో బాగా హెడ్ మసాజ్ చేసి, ఉదయాన్నే పెరుగులో మెంతిపిండి కలిపి తలకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. హెడ్ మసాజ్ చేసుకోవడం వల్ల అలసిన కళ్ళు రిలాక్స్ అవుతాయి. కళ్ళ మంటలు, తలనొప్పి తగ్గుతుంది. మసాజ్ మూలంగా రక్తప్రసరణ బాగా జరిగి, స్వేదరంధ్రాలు తెరచుకుని వెంట్రుకలు పెరిగేందుకు దోహదం చేస్తుంది. అంతేగాకుండా మాడుకు చలువ చేస్తుంది.
వారానికోసారి హెడ్ మసాజ్ చేయించుకుని తలను శుభ్రం చేసుకుంటే పేల సమస్య నుండి దూరంగా ఉండవచ్చు. ఈ హెడ్ మసాజ్ను ఎవరు పడితే వారు చేసుకోవడం కంటే, నిపుణులతో చేయించుకుంటేనే మెదడుకు, కళ్ళకు ఎక్కువ విశ్రాంతి లభిస్తుంది. అలాగని ప్రతిసారీ బ్యూటీపార్లర్కు ఏం వెళ్ళగలం అనుకోకండి. హెడ్ మసాజ్ చేయడం అలవాటు చేసుకుంటే… మెల్ల మెల్లిగా దాంట్లోనే నైపుణ్యం సాధించవచ్చు.