రైళ్లలో ప్రయాణం చేసేవారు తప్పక తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన రూల్స్ ఏవో చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్గా పేరొందిన భారతీయ రైల్వే నిత్యం కోట్లాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది. రైల్వే శాఖ ప్రయాణీకుల భద్రత, సౌకర్యానికి పెద్దపీట వేస్తుంది. ఇందుకు అనేక నియమ, నిబంధనలు రూపొందించింది. లగేజీ సైజు, ఆహార పదార్థాలు, బెర్తులు, మహిళలు, చిన్న పిల్లల భద్రత విషయంలో అనేక నియమ నిబంధనలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. రైళ్లలో ప్రయాణం చేసేవారు తప్పక తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన రూల్స్ ఏవో చూద్దాం. రైలుతో ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రత విషయంలో రైల్వే శాఖ అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఒక మహిళ తన బిడ్డతో ఒంటరిగా ప్రయాణిస్తుంటే ఆమెను రాత్రిపూట రైలు నుండి దింపకూడదని నిబంధన ఉంది. ఒకవేళ ఆమె దిగాల్సిన స్టేజి వస్తే స్టేషన్లోని సెక్యూరిటీ గార్డు లేదా రైల్వే పోలీసులకు సమాచారం అందించి, ఆమె భద్రత బాధ్యతలు అప్పగించాలి. ఇది మహిళలు, పిల్లల భద్రత కోసం భారతీయ రైల్వే ఈ కఠినమైన నిబంధన విధించింది.
చాలా మంది ఆలస్యంగా రైల్వే స్టేషన్కు చేరుకొని రైలును మిస్ చేసుకుంటారు. అలాంటివారు కూడా తర్వాతి స్టేషన్లో అదే రైలును ఎక్కే సౌకర్యం కల్పిస్తుంది భారతీయ రైల్వే. ఒకవేళ, ఎక్కాల్సిన రైలు తప్పిపోతే వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చి వేరే వాహనంలో తదుపరి స్టేషన్కు చేరుకోవచ్చు. లగేజీ బరువు విషయంలోనూ భారతీయ రైల్వే నిబంధనలు చేర్చింది. రైలులో ఒక వ్యక్తి 70 కిలోల కంటే ఎక్కువ బరువున్న లగేజీని తీసుకెళ్లకూడదని రైల్వే నిబంధనలు చెబుతున్నాయి. 70 కిలోల కంటే ఎక్కువ లగేజీని తీసుకెళ్లడం భారతీయ రైల్వే నిబంధనలకు విరుద్ధం. చెకింగ్ సమయంలో లగేజీ ఎక్కువగా ఉందని గుర్తిస్తే టీసీ జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అందువల్ల, రైలులో ప్రయాణించేటప్పుడు ఎక్కువ లగేజీ తీసుకెళ్లకూడదు.
మిడిల్ బెర్త్ విషయంలోనూ భారతీయ రైల్వే నిబంధనలు చేర్చింది. మిడిల్ బెర్త్ను ప్రయాణీకులు కూర్చోవడానికి మాత్రమే ఉపయోగించాలి. నిబంధన ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే మిడిల్లో నిద్రపోవాలి. అంటే, ఉదయం 6 గంటల తర్వాత మిడిల్ బెర్త్పై పడుకోవద్దనే నిబంధన పేర్కొంది. రైలులో ప్రయాణించే వారు ఫోన్ లౌడ్స్పీకర్ పెట్టి పాటలు వినకూడదు. బిగ్గరగా మాట్లాడకూడదు. ఇలా చేయడం వల్ల తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోందని రైల్వే నిబంధన చెబుతోంది. ఇలా ఎవరైనా ప్రయాణికులు తోటి వారిని ఇబ్బంది పెడితే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, స్టేషన్లో దుకాణదారులు ఆహార పదార్థాలు, ఇతర వస్తువులను ఎంఆర్పీ ధర కంటే ఎక్కువ రేటుకు విక్రయించరాదు. అలా చేయడం నేరంగా పరిగణించి రైల్వే అధికారులు షాపు యజమానికి జరిమానా విధిస్తారు. ఒకవేళ, రైల్వే స్టేషన్లో కొనే వస్తువులకు ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తే వెంటనే దాని గురించి రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేయవచ్చు. పై నిబంధనలు ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని రైల్వే శాఖ చెబుతోంది.