ఏయే సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్‌ను కలవాలి..? తెలుసుకోండి..!

మనకు ఎప్పటికప్పుడు అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. కొన్ని సమస్యలు ఎలాంటి చికిత్స తీసుకోకపోయినా అవే నయం అవుతాయి. కొన్నింటికి చికిత్స అవసరం అవుతుంది. అయితే కొన్ని అనారోగ్య సమస్యలకు మాత్రం దీర్ఘకాలం చికిత్స లేదా సర్జరీ వంటివి అవసరం అవుతుంటాయి. కానీ ఏ అనారోగ్య సమస్య వచ్చినా మన శరీరం పలు లక్షణాలను చూపిస్తుంది. వాటిని గమనించి డాక్టర్‌ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుని అవసరం అయిన మేర మందులను వాడుకోవాలి. అనారోగ్యాలను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యలుగా మారేందుకు అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్త వహించాలి.

what is the best time to consult doctor after having unhealthy symptoms

అయితే అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలా, కొంత సమయం ఆగాలా ? అని చాలా మంది సందేహిస్తుంటారు. ఈ క్రమంలోనే ఏయే అనారోగ్య సమస్యలు, లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఛాతీలో ఎడమవైపు నొప్పి వస్తుంటే దాన్ని అనుమానించాలి. కొందరికి అసిడిటీ వల్ల ఈ నొప్పి వస్తుంది. కానీ కొందరిలో గుండె సమస్యలు ఉంటే ఈ నొప్పి వస్తుంది. ఏ సమస్య అయిందీ మనకు కచ్చితంగా తెలియదు. కనుక ఈ నొప్పి తరచూ వస్తుంటే ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కేవలం అసిడిటీ మాత్రమే అయితే ఫర్వాలేదు. కానీ గుండె సమస్య అయితే పరీక్షల్లో తెలుస్తుంది. దీంతో ముందుగానే అప్రమత్తమై ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఛాతిలో వచ్చే నొప్పిని అస్సలు నిర్లక్ష్యం చేయరాదు.

2. కొందరికి తరచూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. శ్వాసకోశ సమస్యలు లేదా ఆస్తమా, గుండె సమస్యలు ఉంటే ఇలా జరుగుతుంది. కనుక ఈ సమస్య వస్తున్నా నిర్లక్ష్యం చేయరాదు. వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి.

3. కొందరు జ్వరం ఉంటే మెడికల్‌ షాపుకు వెళ్లి మందులను కొని తెచ్చి వేసుకుంటారు. సాధారణ జ్వరం అయితే తగ్గుతుంది. ఆ మందులను వేసుకున్నా ఫర్వాలేదు. కానీ జ్వరం తీవ్రత తగ్గకుండా పెరుగుతున్నా, జ్వరం 102 డిగ్రీలు, అంతకన్నా ఎక్కువగా ఉన్నా నిర్లక్ష్యం చేయరాదు. వెంటనే వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

4. సాధారణంగా తలనొప్పి ఎవరికైనా వస్తుంటుంది. కానీ ఎంతకూ తగ్గకుండా ఎప్పుడూ తలనొప్పి వస్తున్నా, దాంతోపాటు వాంతులు అవడం, తలతిరగడం, స్పృహ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తున్నా.. ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. వెంటనే చికిత్స తీసుకోవాలి. డాక్టర్‌ను కచ్చితంగా కలవాలి.

5. ఏ అవయవాలైన బలహీనం కావడం, మాటలో అస్పష్టత లేదా తాత్కాలిక అంధత్వం.. వంటి లక్షణాలు కనిపిస్తుంటే పక్షవాతం వస్తుందని అనుమానించాలి. ఇవి కొంత సేపు ఉండి మాయమవుతాయి. కానీ వీటితోపాటు తల తిరగడం, చికాకు వంటి లక్షణాలు కూడా ఉంటే పక్షవాతం వచ్చేందుకు వాటిని సంకేతాలుగా భావించాలి. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

6. ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మలవిసర్జన చేస్తారు. అయితే రోజూ ఒకే సమయంలో కాకుండా భిన్న సమయాల్లో విరేచన అవుతున్నా, కడుపులో నొప్పి వస్తున్నా, పొట్ట ఆకస్మికంగా పెరిగినా.. ఆ లక్షణాలను ట్యూమర్‌ లేదా పేగు సంబంధ వ్యాధిగా అనుమానించాలి. వైద్యులను సంప్రదించాలి.

7. మందులు వాడుతున్నా దగ్గు తగ్గకపోవడం, నెల రోజులకు పైగా దగ్గు వస్తుండడం, దగ్గుతోపాటు శ్లేష్మం వస్తుండడం వంటివన్నీ టీబీ (క్షయ)కు లక్షణాలు. కనుక ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అలాగే దగ్గుతోపాటు రక్తం పడుతుంటే పరిస్థితి తీవ్రతరం అయినట్లు గ్రహించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను కలవాలి.

8. చేతులు, పాదాలు లేదా వేళ్లు ఉదయాన్నే వాపు ఉన్నట్లు కనిపిస్తుంటే అది గుండె లేదా మూత్ర పిండాలకు సంబంధించిన సమస్య అయి ఉంటుంది. ఈ లక్షణం కనిపించినా ఆలస్యం చేయరాదు. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts