ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు ఉన్నాయని, వాటికి రాజధాని నగరాలు కూడా ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే ఏ రాజధాని నగరాన్నయినా మొత్తం చుట్టి వచ్చేందుకు ఎంత సమయం పడుతుంది. ఆ… ఎంతేమిటీ… వాహనం ఉంటే రోజుల వ్యవధిలో కాలి నడకన అయితే నెలల వ్యవధిలో తిరిగి రావచ్చు. అయితే ఇది కరెక్టే. కానీ మీకు తెలుసా..? ఆ దేశ రాజధాని నగరాన్ని మాత్రం కేవలం ఒక్క రోజులోనే తిరిగి రావచ్చు. అది కూడా కేవలం కాలి నడక ద్వారానే. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకీ ఏంటా దేశం..? దాని రాజధాని ఏది..? అది సీషెల్స్ దేశం. హిందూ మహాసముద్రంలో ఉన్న 115 దీవులతో కలిసి ఈ దేశం ఏర్పడింది. ఈ దేశ రాజధానే విక్టోరియా. ఈ నగరాన్నే ఎవరైనా కేవలం ఒకే రోజులో కాలి నడకన చుట్టి రావచ్చు. అంత చిన్నగా ఉంటుంది ఆ నగరం.
నగరం అనే కంటే ఆ సిటీని చిన్న దీవి అంటేనే బాగుంటుంది. అంటే… దాని స్వరూపం అలా ఉంటుందన్న మాట. అందుకే దాన్ని కేవలం ఒక్క రోజులోనే ఎవరైనా కాలి నడకన చుట్టి రావచ్చు. ఈ క్రమంలో ఈ దేశంలో ఉన్న ఇంకా అనేక ఇతర విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. సీషెల్స్ జాతీయ జెండాలో నీలం రంగు ఆకాశానికి, సముద్రానికి గుర్తు. పసుపు సూర్యకాంతికి, జీవానికి, ఎరుపు రంగు ఐకమత్యానికి, ప్రేమకు, తెలుపు సామాజిక న్యాయానికి, సామరస్యానికి, ఆకుపచ్చ రంగు ప్రకృతికి, పర్యావరణానికి సూచికలు. సీషెల్స్ దేశం మొత్తం జనాభా 92వేలు. విస్తీర్ణం 459 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ ఇంగ్లిష్, ఫ్రెంచ్, సీషెలోయిస్, క్రెయోల్ భాషలను మాట్లాడుతారు. ఇక్కడి కరెన్సీ సీషెల్స్ రుపియా.
ఈ దేశంలో ఒకప్పుడు సముద్రపు దొంగలు దాక్కునేవారు. వచ్చిపోయే నౌకల్ని లూటీ చేసి డబ్బులు ఇక్కడ దాచుకునేవారట. ఆలివర్ లే వస్సెర్ అనే సముద్రపు దొంగ దాచుకున్న లక్ష యూరోలు ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయని స్థానికులు నమ్ముతుంటారు. మొత్తం భూభాగంలో సగానికిపైగా జాతీయ పార్కులతో ఉంటుందిది. పర్యావరణానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వ విధానాల వల్ల ఇది సాధ్యమైంది. కింగ్ లూయిస్ – 15 రాజు ఆస్థానంలో ఉన్న ఆర్థిక మంత్రి జీన్ మోరియో డి సీషెల్స్ పేరును ఈ ద్వీపానికి పెట్టారు. ఈ దీవిలో అందమైన తోకతో ఉన్న ప్యారడైజ్ ఫ్లై కాట్చర్ వంటి బోలెడు వింత పక్షులు ఉన్నాయి. మన దేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన వాస్కో డా గామా 15వ శతాబ్దంలో ఈ దీవిని గుర్తించారు. తర్వాత ఫ్రెంచ్, బ్రిటిష్ అధీనంలో ఉండి ఈ దేశం 1976లో స్వాతంత్య్రం పొందింది. ఆఫ్రికా ఖండంలో ఉన్న ఈ దేశం సహజవనరులతో సంపన్నంగా ఉన్న దేశాల్లో ఒకటిగా పేరుతెచ్చుకుంది.
ప్రపంచంలోనే భారీ విత్తనం ఉన్నది ఈ దేశంలోనే. పేరు కోకో డి మెర్. కొబ్బరికాయని పోలి ఉన్న ఈ విత్తనం 30 కిలోల బరువు ఉంటుంది. దీన్ని డబుల్ కోకోనట్ అని కూడా పిలుస్తారు. జేమ్స్బాండ్ సృష్టికర్త ఇయాన్ ఫ్లెమింగ్ ఫర్ యువర్ ఐస్ ఓన్లీ నవల రాయడానికి అవసరమైన ప్రేరణ కోసం సీషెల్స్ని సందర్శించారట. హిందూ మహా సముద్రంలో ఎగరలేని పక్షి అయిన వైట్ త్రోటెడ్ రైల్ ఉండేది ఇక్కడే. 304 కిలోల అత్యధిక బరువుండే ఎస్మెరాల్డా అనే తాబేళ్లు ఉండేది ఇక్కడే. ఈ ద్వీపదేశం మంచి సందర్శక ప్రాంతం. దేశదేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు. ఎక్కువ ఆదాయం పర్యటకం ద్వారా పొందుతారు. ఇక్కడ అరుదైన జెల్లీఫిష్ చెట్లు ఉంటాయి. ప్రస్తుతం ఇవి 8 మాత్రమే ఉన్నాయి. సీషెల్స్లోని గ్రానిటిక్ దీవులు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సముద్రపు దీవులుగా పేరుగాంచాయి. ఇక్కడ పిల్లలు 6 ఏళ్ల వయస్సులో స్కూల్స్లో చేరుతారు. 13 ఏళ్ల పాటు వారు పాఠశాల విద్యను అభ్యసిస్తారు.