Multi Grain Roti : చపాతీల విషయానికి వస్తే చాలా మంది వాటిని ఇష్టంగానే తింటుంటారు. కానీ వాటికి తగిన కూర ఉండాలి. అప్పుడే వాటిని లాగించేస్తారు. అయితే రొట్టెలను గోధుమ పిండితో కాకుండా మల్టీ గ్రెయిన్ పిండితో చేస్తే ఇంకా బాగుంటాయి. అప్పుడు ఈ కూర ఆ కూర అని కాదు.. ఎలాంటి కూర అయినా సరే రోటీలను లాగించేస్తారు. ఇక మల్టీగ్రెయిన్ పిండితో రొట్టెలను ఎలా తయారు చేయాలి, అందుకు ఏమేం పదార్థాలు కావాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మల్టీ గ్రెయిన్ రోటీల తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్న పిండి – పావు కప్పు, సజ్జ పిండి – పావు కప్పు, గోధుమ పిండి – పావు కప్పు, శనగ పిండి – 2 టేబుల్ స్పూన్లు, రాగి పిండి – పావు కప్పు, ఉల్లిముక్కలు – పావు కప్పు, కొత్తిమీర తురుము – 3 టేబుల్ స్పూన్లు, టమాటాలు – పావు కప్పు, పచ్చి మిర్చి ముక్కలు – 1 టీస్పూన్, కారం – 1 టీస్పూన్, పసుపు – పావు టీస్పూన్, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి సరిపడా.

మల్టీ గ్రెయిన్ రోటీలను తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో అన్ని పిండిలను వేసి తగినన్ని నీళ్లు పోసి కలపాలి. తరువాత ముద్దను ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఓ ప్లాస్టిక్ కవర్పై నెయ్యి లేదా నూనె రాసి దాని మీద ఉండని పెట్టి చేత్తో వత్తుతూ రొట్టెలా చేయాలి. ఇప్పుడు దీన్ని నాన్ స్టిక్ పెనం మీద వేసి నూనె వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి. అంతే.. ఎంతో సుతి మెత్తని, రుచికరమైన మల్టీ గ్రెయిన్ రోటీలు రెడీ అవుతాయి. వీటిని ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. వీటిని నేరుగా అయినా తినవచ్చు లేదా ఏదైనా కూరతోనూ తినవచ్చు. ఇలా తింటే రుచికి రుచి లభిస్తుంది, అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.