భారత దేశంలో కోవిడ్ టీకాల పంపిణీ జనవరి 16వ తేదీన ప్రారంభమైంది. ప్రస్తుతం రెండో దశ టీకాల పంపిణీ కొనసాగుతోంది. ఇందులో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లకు పైబడి ఉండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వ్యాక్సిన్లను ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు మొత్తం 2,30,08,733 మందికి టీకాలను ఇచ్చారు. అయితే కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకున్న వారు మాస్క్లను ధరించడం ఆపేయవచ్చా ? అంటే అందుకు నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారంటే…
కోవిషీల్డ్తోపాటు కోవాగ్జిన్ వ్యాక్సిన్ కూడా ఎవరైనా సరే రెండు డోసులను తీసుకోవాల్సి ఉంటుంది. రెండో డోసు తీసుకున్న తరువాత 2 వారాలకు పూర్తి స్థాయి రోగ నిరోధకత వస్తుంది. అంటే వైరస్ను ఎదుర్కొనేందుకు శరీరంలో పూర్తి స్థాయిలో యాంటీ బాడీలు తయారవుతాయని అర్థం. ఆ తరువాతే వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఏవీ వైరస్ నుంచి మనకు 100 శాతం రక్షణను ఇవ్వవు. ఆ విషయాన్ని వ్యాక్సిన్ తయారీ సంస్థలే తెలిపాయి.
ఇక వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కోవిడ్ వస్తుందా, రాదా.. అన్న విషయంపై కూడా స్పష్టత లేదు. వ్యాక్సిన్ తీసుకున్నాక కోవిడ్ వస్తుందని లేదా రాదని చెప్పడానికి సైంటిస్టులు కూడా వెనుకాడుతున్నారు. అందువల్ల వ్యాక్సిన్లు మనకు పూర్తి స్థాయి రక్షణను ఇస్తాయని నమ్మడానికి లేదు. కనుక కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని నిర్దారణకు వచ్చే వరకు కరోనా జాగ్రత్తలను పాటించాల్సిందే. మాస్కులను ధరించాల్సిందే. భౌతిక దూరం పాటించాల్సిందే. వ్యాక్సిన్ వేసుకున్నాం కదా అని చెప్పి నిర్లక్ష్యంగా ఉండరాదు. ఏమో.. వ్యాక్సిన్ వేసుకున్నా వైరస్ రావచ్చు. కనుక జాగ్రత్తగా ఉండాల్సిందే.